Haritha Haram | మేడ్చల్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమై సత్ఫాలితాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ వచ్చే జూన్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేలా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాలలోని శివారు మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 63 లక్షల మొక్కలు నాటనున్నారు. దీనికి సంబంధించి డీఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 13 శివారు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ వార్డులలో వివిధ రకాల మొక్కలు నాటనున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, అర్బన్పార్కులు, పార్క్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లాలోని 61 నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. అవసరమైతే జీహెచ్ంఎసీతో పాటు, అటవీశాఖ మొక్కలను సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
హరితహారం కార్యక్రమం నిర్వహణతో పట్టణ, శివారు ప్రాంత మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలు పచ్చందాలతో ఆహ్లాదకరంగా మారాయి. పట్టణ, పల్లె పకృతి వనాలు ఏపుగా పెరిగి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. పట్టణ, పల్లె పకృతి వనాలలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగేలా ప్రత్యేక దృష్టి సారించడంతో పట్టణ, పల్లె ప్రకృతి వనాలు నగరంతో పాటు పల్లెలకు అందాలను తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా ప్రకృతి వనాలలో ప్రజలు వాకింగ్ చేసుకునేల వాకింగ్ ట్రాక్లు, కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు, పిల్లలు అడుకునేలా క్రీడా పరికరాలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడంతో హరితహారం కార్యక్రమం విజయవంతమైన విషయం విధితమే.
గత సంవత్సరం 63లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఈ సారికూడా అదే 63 లక్షల మొక్కలు జిల్లాలో నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించి ఉపాధి హామీ కూలీలచే గుంతలను తవ్వించనున్నారు. హరితహారం విజయవంతం చేసేలా జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు.