హైదరాబాద్, జూన్ 11(నమస్తేతెలంగాణ): ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్.. 30 నెలల్లో 20వేల జాబ్లు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిండా ముంచిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవాప్తంగా 19వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇస్తామనడం అన్యాయమని మండిపడ్డారు.
తక్షణమే ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసి, కుదించిన వయోపరిమితిని రద్దు చేసి పాత పద్ధతిలో కానిస్టేబుళ్లకు 36, ఎస్ఐ జాబ్లకు 38 ఏండ్ల గరిష్ఠ వయోపరిమితిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగార్థులు గురువారం హరీశ్రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలు ఏకరువు పెట్టారు. నోటిఫికేషన్ల జారీలో ప్రభుత్వ తీవ్ర జాప్యం చేస్తున్నదని, వయస్సు పెరిగిపోవడంతో అవకాశాలు కోల్పోతున్నామని తమ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విన్నవించగా బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
కేసీఆర్ హయాంలో ఒక్క పోలీసు శాఖలోనే 48వేల ఖాళీలను భర్తీ చేశామని హరీశ్రావు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19వేల పోలీస్ ఖాళీ పోస్టుల్లో 5వేలకే నోటిఫికేషన్ ఇస్తే వాటిలో 2వేలు హైదరాబాద్ పరిధిలోకి వెళ్లిపోతాయని తెలిపారు. మిగిలినవి రిజర్వేషన్ల ప్రకారం కులానికి ఒక్క పోస్టు కూడా దక్కదని ఆవేదన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈవెంట్స్ నిబంధనలు కఠినతరం పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితిని కుదించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈవెంట్స్ నిబంధనలను కఠినతరం చేయడంపై హరీశ్రావు అభ్యంతరం చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఐదు ఈవెంట్లలో మూడింటికి అర్హత సాధిస్తే సరిపోయేదని కానీ ప్రస్తుతం లాంగ్జంప్, షార్ట్ఫుట్లో దూరం పెంచడం, మూడింటికి మూడు క్వాలిఫై కావాలనడం అన్యాయమని మండిపడ్డారు. ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది అభ్యర్థులు ఉంటున్న దిల్సుఖ్నగర్, అశోక్నగర్ లాంటి ప్రాంతాల్లో ఈవెంట్స్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్తో పాటు ఇతరత్రా సౌకర్యాలు లేవని పేర్కొన్నారు.
జాబ్ అప్లికేషన్లకు ఫీజు ఉండదని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వేలకు వేలు ఫీజులు దండుకొంటూ నిరుద్యోగుల నడ్డివిరుస్తున్నదని హరీశ్రావు దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ మేరకు తక్షణం ఫీజు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. 19వేల పోలీసు పోస్టులతో పాటు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సాధించేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. అటు చట్టసభల్లో ఇటూ ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.