కొండాపూర్, డిసెంబర్ 8: ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించింది. బుధవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో రహేజా కే కార్ప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన 120 పడకలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, విప్ అరెకపూడి గాంధీలతో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో వివిధ వైద్యశాలల్లో పడకలు సరిపోవడం లేదని గ్రహించిన ప్రభుత్వం కేవంల రెండు నెలల్లో యుద్ధప్రాతిపదికన సీఎస్ఆర్ కింద 1300 పడకలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. కొండాపూర్లో అత్యాధునిక సౌకర్యాలతో పాటు కార్పొరేట్కు దీటుగా రహేజా గ్రూపు సహకారంతో మరో 120 అదనపు పడకలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీంతో పాటుగా వనస్థలిపురం, గోల్కొండ, మలక్పేట్, నాంపల్లిలోని దవాఖానల్లో 100 పడకలు, నీలోఫర్ దవాఖానలో 800 పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కొండాపూర్లోని జిల్లా దవాఖానలో అందుబాటులోకి వచ్చిన అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉందన్నారు.
కొండాపూర్లో త్వరలో డయాలసిస్ సెంటర్..
కొండాపూర్లోని వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ జిల్లా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ వినతితో మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
బాధ్యత తీసుకోవాలి..
జిల్లా దవాఖాన మెయింటెనెన్స్ను కూడా స్వీకరించాల్సిందిగా రహేజా కే కార్ప్ గ్రూపును మంత్రి కోరారు. దీంతో ఆ గ్రూపు సీఈవో వినోద్ రోహిరా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, వైద్య శాఖ అధికారులు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్గౌడ్, అధికారులు నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ అధికారులు, జిల్లా దవాఖాన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులో 220 పడకలు..
కొండాపూర్ వైద్యశాలలో 220 పడకలు అందుబాటులోకి వచ్చాయి. సీఎస్ఆర్ కింద రహేజా గ్రూప్ రూ.10 కోట్లు వెచ్చించి 120 పడకలను 220కి పెంచింది. దీంతో పాటుగా 24 ఐసీయూ పడకలున్నాయి. కొవిడ్తో పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా వార్డులు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 500 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్తో పాటు సీఎస్ఆర్ కింద పీఎస్ఏ సంస్థ అందించిన మరో 250 ఎల్పీఎం ఆక్సిజన్ ప్లాంట్, జనరేటర్లు అందుబాటులో ఉన్నాయి.
రూ.3 కోట్లతో వైద్య పరికరాలు..
కొండాపూర్ జిల్లా దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లతో వైద్య పరికరాలను ఏర్పాటు చేసింది. దీంతో పాటు నిరంతరాయంగా వైద్యం అందించేందుకు 13 మంది డాక్టర్లు, పిడియాట్రిషన్ల సేవలను అందుబాటులోకి తెచ్చింది.
కల నిజమైంది..
రంగారెడ్డి జిల్లా దవాఖాన అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, రహేజా గ్రూపు సహకారంతో కొండాపూర్ దవాఖానను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాం. వైద్యశాలలోని కిందిస్థాయి అంతస్తులను సైతం ఇదే తరహాలో మార్చేందుకు రహేజా సంస్థ ముందుకు రావాలని కోరుకుంటున్నా. త్వరలోనే దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావుకు విన్నవించా. -ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ