వనస్థలిపురం, ఏప్రిల్ 9 : రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. గుర్రంగూడలో నివాసముండే కేలోతు జగ్రు నాయక్ కుమారుడు గోపి నాయక్ (26) రాజిరెడ్డి కాలనీలో నివాసముండే ఓ యువతి 2018 నుంచి ప్రేమించుకుంటున్నారు. 2019లో గోపీ పైచదువుల కోసం లండన్ వెళ్లాడు.
యువతి ఫోన్ చేసి హైదరాబాద్కు రావాలని కోరడంతో గోపి చదువు మధ్యలోనే ఆపేసి వచ్చాడు. ఆ తర్వాత గోపి బైజూస్ సంస్థలో పనిచేస్తుండగా 6 నెలల కిందట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కులం పేరుతో గోపినాయక్ను వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.