హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ్ మందిర్ నుంచి సికింద్రాబాద్లోని తాడ్బండ్ వరకు 12 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. శోభాయాత్ర ప్రారంభం కంటే ముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గౌలిగూడ రామ్ మందిర్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఇక కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ రెండు శోభాయాత్రలు కోఠిలో కలుసుకోనున్నాయి. గౌలిగూడ, కోఠి, సుల్తాన్ బజార్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, గాంధీ నగర్, కవాడిగూడ, ఆర్పీ రోడ్, ప్యారడైస్ మీదుగా శోభయాత్ర కొనసాగనుంది.
హనుమాన్ శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శోభాయాత్రకు సంబంధించిన భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల కెమెరాలతో నిఘా ఉంచారు. మొత్తం 8 వేల మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.