హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం బిర్యానీకి పెట్టింది పేరు. హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నారంటే జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిందే. దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అందుకే రాజధానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఘుమఘుమలాడే దమ్ బిర్యానీ తినాల్సిందే.. వాహ్ అనాల్సిందే.
బిర్యానీ లాగే.. హలీంకు కూడా హైదరాబాద్ నగరం ఎంతో ఫేమస్. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం తినేందుకు జనాలు ఆసక్తి బాగా కనబరుస్తారు. ఇక ఈ రంజాన్ మాసంలో హలీంను బాగా తిన్నట్లు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ అనాలసిస్లో తేలింది. గతేడాదితో పోల్చితే 33 రెట్లు అధికంగా హలీంను ఆర్డర్ చేసినట్లు వెల్లడైంది. దీంతో పాటు చికెన్ బిర్యానీకి కూడా 8 లక్షల ఆర్డర్లు వచ్చాయి.
రంజాన్ మాసం ప్రారంభమైన 20 రోజుల్లోనే చికెన్ బిర్యానీ కోసం జనాలు ఎగబడ్డారు. హలీం, చికెన్ బిర్యానీతో పాటు నిహరీ, సమోస, రబ్దీ వంటి ఫుడ్ను బాగా ఇష్టపడినట్లు స్విగ్గీ అనాలసిస్లో తేలింది. మటన్ హలీం, స్పెషల్ హలీం, చికెన్ హలీం, ముర్గ్ హలీంను బాగా ఆర్డర్ చేసినట్లు వెల్లడైంది. గతేడాదితో పోల్చితే నిహరీ 30 రెట్లు అధికంగా ఆర్డర్ చేశారు. అయితే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య 4.5 లక్షల మంది ఆర్డర్స్ చేసినట్లు పేర్కొన్నది. పన్నీర్ బట్టర్ మసాలా, చికెన్ 65, మసాలా దోసను కూడా ఇష్టపడినట్లు తేలింది.