Haleem | హైదరాబాద్ : రంజాన్ పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాదీలకు హలీం గుర్తుకువస్తోంది. నోరూరించే హలీంను తినేందుకు అందరూ ఇష్టపడుతారు. అలా సాయంత్రం వేళ ప్రధాన హలీం కేంద్రాల వద్ద ఆహార ప్రియులు వాలిపోతారు. ఇక వీలు కాని వారు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. అలా ఈ రంజాన్ మాసంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా 4 లక్షల హలీంలు, పది లక్షల బిర్యానీలు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ సంస్థ వెల్లడించింది.
గత ఏడాది రంజాన్ మాసంతో పోలిస్తే ఈ సారి 20 శాతం డెలివరీ సేవలు పెరిగాయని పేర్కొంది. చికెన్, పాలమూరు పొట్టేల్, పెర్షియన్ స్పెషల్ హలీం, డ్రై ఫ్రూట్స్ హలీం, మటన్ హలీంలు అధికంగా కస్టమర్లు కొనుగోలు చేసినట్టుగా వెల్లడించింది. ఇఫ్తార్లో భాగంగా కర్జూరతో తయారు చేసిన భజియా, గరంగరం సమోసాలకు డిమాండ్ పెరిగినట్టు తెలిపింది. 77 శాతం భజియాస్ ఆర్డర్స్ పెరిగినట్టు తెలిపింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 18 వరకు వచ్చిన ఆర్డర్ల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించినట్లు స్విగ్గీ పేర్కొంది.