బన్సీలాల్పేట్, సెప్టెంబర్ 6 : గాంధీ దవాఖానలో ఇటీవల ప్రారంభించిన మాతా, శిశు ఆరోగ్య కేంద్రం భవనంలో గర్భిణుల కోసం బయటి రోగుల (గైనకాలజీ ఓపీ) సేవలు మొదలయ్యాయి. మెయిన్ రోడ్డు వైపు నిర్మించిన నూతన ఎనిమిది అంతస్తుల భవనం, గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన ఓపీ విభాగంలో ముందుగా కంప్యూటరైజ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తరువాత ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్, బరువులను పరీక్షిస్తున్నారు. అనంతరం గైనకాలజీ, ప్రసూతి వైద్యులు గర్భిణులను పరీక్షిస్తారు. వైద్యుల సిఫారసు మేరకు రక్త పరీక్షలను అక్కడే నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు సుమారు 200 మంది గర్భిణులు వైద్య సేవల కోసం వస్తున్నారు. వెయిటింగ్ హాల్, కుర్చీలు, టాయిలెట్లు తదితర కనీస సదుపాయాలన్నీ నూతన భవనంలో అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఎక్స్రే, స్కానింగ్, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్లు, పిల్లల వైద్య సేవలు కూడా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
ఓపీలో జనరల్ సర్జరీ విభాగం ప్రారంభం
గాంధీ దవాఖానలోని బయటి రోగుల విభాగంలో నూతనంగా జనరల్ సర్జరీ ఓపీ వైద్య సేవలను బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, సర్జికల్ హెచ్వోడీ డాక్టర్ ఎన్వీఎన్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు కొనసాగిన గైనకాలజీ విభాగాన్ని నూతన ఎంసీహెచ్ భవనంలోకి మార్చారు. ఆ వార్డును, గదులను జనరల్ సర్జరీ విభాగానికి కేటాయించారు. అంతకుముందు జనరల్ సర్జరీ వార్డులను పల్మనాలజీ ఓపీ, టీబీ క్లినిక్, మలేరియా విభాగాలకు కేటాయించామని డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు.