Hyderabad | హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. మణికొండలోని పంచవటి కాలనీలో భూ వివాదానికి సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం.
స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని ప్రభాకర్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గాల్లోకి ప్రభాకర్ మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులపై బాధిత వర్గం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.