సిటీబ్యూరో , మే 24, (నమస్తే తెలంగాణ): వచ్చే నెల మొదటి వారం తర్వాత వర్షాలు ప్రారంభ సమయం నుంచి సెల్లార్ తవ్వకాలపై నిషేధం విధించాలని బల్దియా సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతి ఏడాది మాదిరిగానే వర్షాకాలం ప్రారంభం నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు సెల్లార్ తవ్వకాలపై నిషేధం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సెల్లార్ తవ్వకాలపై మార్గదర్శకాలు త్వరలో జారీ చేస్తామన్నారు.
వర్షాకాలం జాగ్రత్త చర్యల్లో భాగంగా పురాతన, శిథిల భవనాలతో పాటు సెల్లార్ల తవ్వకాలపై ఫోకస్ పెట్టిన బల్దియా.. ఎట్టి పరిస్థితుల్లో సెల్లార్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మాణాలు చేపడుతున్న ప్రతి బిల్డర్ రక్షణ చర్యలు చేపట్టాలని, రక్షణ గోడ నిర్మాణం, పని జరుగుతున్న ప్రదేశం చుట్టూ బారికేడింగ్, సెల్లార్లో నీరు నిల్వకుండా చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.
వర్షాకాలం ప్రారంభం నుంచి ముగిసే వరకు సెల్లార్ తవ్వకాలు నిలిపివేయాల్సి ఉంటుంది. అప్పటికే తవ్వి ఉంటే.. అక్కడ అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలి. రిటైనింగ్ వాల్, బారికేడింగ్ తదితర చర్యలు తీసుకోవాలి. తవ్విన సెల్లార్కు నిర్మాణం మొదలై ఉంటే చుట్టు పక్కల భవనాలకు ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు పాటించాలి. అక్రమంగా ఎవరైనా సెల్లార్ తవ్వితే వెంటనే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
గ్రేటర్ పరిధిలో పురాతన భవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. వర్షాకాలం నేపథ్యంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన అధికారులు.. ఆరు జోన్లలో 459 శిథిల భవనాలను గుర్తించారు. గతేడాది 231 శిథిల భవనాలను కూల్చివేయగా, 294 వాటికి మరమ్మతులు జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా శిథిల భవనాల విషయాన్ని సీరియస్గా తీసుకుని ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వానకాల విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పురాతన భవనాల పటిష్టత , భద్రతపై ఇంజినీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, అత్యంత ప్రమాదకరంగా ఉన్న వాటిని కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ డ్రైవ్లో భాగంగా పురాతన భవనాలపై జోన్ల వారీగా సర్వే సంబంధిత భవన నాణ్యతను పరిశీలించి, ప్రమాదకర భవనాలకు నోటీసులు జారీ చేయడం, ప్రమాదకరమైనవి కూల్చివేయనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలపై 040-2111 1111కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.