గ్రీనరీ అండ్ ల్యాండ్ స్కేపింగ్లో హెచ్ఎండీఏ ముద్ర
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పచ్చదనానికి పెద్దపీట
అర్బన్ హరితహారం పేరుతో సరికొత్త కార్యక్రమం
ఇంటి మొక్కలు నగరవాసులకు ఉచితంగా పంపిణీ
నగరం నలువైపులా నర్సీల నిర్వహణ
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరవాసులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పని చేస్తోంది. నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ చుట్టూ రెండేండ్లలో చేపట్టిన కార్యక్రమాలే ఇందుకు నిదర్శనం. అదేవిధంగా నగరం చుట్టూ మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డును కూడా పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్గా మార్చింది హెచ్ఎండీఏ. ప్రతియేటా కోట్లాది మొక్కలను వందకు పైగా ఉన్న నర్సరీల్లో పెంచుతూ వాటిని హరితహారం కార్యక్రమంలో నాటడంతో పాటు నగర వాసులకు ఉచితంగానూ అందజేస్తోంది.
విశ్వనగరంగా మారుతున్న మహానగరంలో ఖాళీ స్థలాలలో యాదాద్రి మోడల్ మియావాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్ , అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ ట్రీ పార్లు తదితర రకాల పేర్లతో పచ్చదనం, సుందరీకరణ పనులను హెచ్ఎండీఏ చేపడుతున్నది. హరితహారంలో భాగంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగినట్లు తాజాగా తేల్చారు. గతంలో 33.15 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం కాగా హరితహారం కార్యక్రమం చేపట్టిన తర్వాత అటవీ విస్తీర్ణం 81.81 స్వేర్ కిలో మీటర్లకు పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఎఫ్ఎస్ఐతో పాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏవో (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్) సంస్థలు 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్గా గుర్తించింది.
కొత్తగా అర్బన్ హరితహారం..
ప్రతి ఇంటిలోనూ పచ్చదనాన్ని పెంచేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇందుకు కొత్తగా అర్బన్ హరితహారం పేరుతో ఇంట్లో పెట్టుకునే మొక్కలు ఉచిత పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ట్యాంక్బండ్పై నిర్వహించిన సన్డే ఫన్ డేలో నగరవాసులకు 3-4 లక్షల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. దీన్ని మరింతగా చేపట్టాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా నర్సరీల్లో మొక్కలు పెంచి, జూన్లో పంపిణీ చేస్తామని అర్బన్ ఫారెస్ట్ విభాగం అధికారులు తెలిపారు.
ఔటర్ చుట్టూ కనువిందు చేస్తున్న పచ్చందాలు
ఔటర్కు మరింత అందాలను తీసుకువచ్చేలా నాటుతున్న మొక్కలు కనువిందు చేస్తున్నాయి. పొగడ, గన్నేరు, దురంద, అకాలిఫా, ఇనేర్మి, ఫడరన్ తదితర మొక్కలను నాటి పచ్చని తోరణంగా ఔటర్ మార్గాన్ని మార్చుతున్నారు. అంతేకాదు రేడియల్ రోడ్ల వెంబడి ఎవెన్యూ ఫ్లాంటేషన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా 19 ఇంటర్ఛేంజ్ల వద్ద రోటరీలు హరితశోభను సంతరించుకుంటున్నాయి. శామీర్పేట, కీసర బొంగుళూరు, అప్పా జంక్షన్, నార్సింగ్, దుండిగల్లో ఉన్న రెండేసీ రోటరీలు ముచ్చలగొలిపే విధంగా ఆహ్లాదాన్ని పంచుతుండడం గమనార్హం.
సాగర్ తీరంలో గ్రీనరీ..
నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీర ప్రాంతం అభివృద్ధి అంతా హెచ్ఎండీఏనే చేపడుతోంది. ట్యాంక్బండ్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, పీవీమార్గ్(నెక్లెస్ రోడ్డు), సంజీవయ్య పార్కు, పార్కు వ్యూ, పీవీ ఘాట్… ఇలా అన్ని ప్రాంతాల్లో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను కనువిందు చేసేలా పచ్చిక బయళ్లను, రంగు రంగుల పూల మొక్కలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పీవీమార్గ్లో ఉన్న ఇందిరాగాంధీ రోటరీ, దానికి ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన పీవీ రోటరీని సైతం ఆకట్టుకునేలా అర్బన్ ఫారెస్ట్ అధికారులు తీర్చిదిద్దారు.