London : లండన్ మార్ల్బరో హౌస్లోని కామన్వెల్త్ సెక్రటేరియట్లో భారత ప్రతినిధి బృందం డా. సురేష్ యాదవ్ (సీనియర్ డైరెక్టర్, క్లైమేట్ చేంజ్ అండ్ ఓషన్స్ డైరెక్టరేట్)ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం కలిసింది. ఈ సందర్భంగా భారత్లో భారీ స్థాయిలో కొనసాగుతున్న పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాన్ని కామన్వెల్త్ దేశాలకు విస్తరించే అవకాశాలపై చర్చించారు.
ఈ ప్రతినిధి బృందానికి రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ చైర్మన్జోగినిపల్లి సంతోష్ కుమార్ నేతృత్వం వహించగా, సంస్థ వ్యవస్థాపకుడు ఎం. కరుణాకర్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవల్ల రాఘవేందర్ పాల్గొన్నారు. యూకే టీమ్ సభ్యులు గణేష్ కుప్పల, రవి పులుసు, అనిల్ కుర్మచలం, నవీన్ రెడ్డి హాజరయ్యారు.

మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం ఆలోచనలతో 2011లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం గత 15 సంవత్సరాల్లో విశేష ఫలితాలను సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 196 మిలియన్ మొక్కలు నాటడం, 22,000 వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, వేలాది నీటి వనరులను పునరుద్ధరించడం ద్వారా గ్రామీణ జీవన విధానంలో గణనీయ మార్పులు తీసుకొచ్చింది.
ఈ సమావేశంలో పారిస్ ఒప్పందం Article 6.4 ప్రకారం కార్బన్ క్రెడిట్ వ్యవస్థలో భాగస్వామ్యం, అలాగే బ్లాక్చైన్ ఆధారిత “భారత్ రీజెనరేషన్ ఇండెక్స్” ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టుల ధ్రువీకరణ అవకాశాలపై చర్చించారు. సుందర్బన్స్ వంటి ప్రాంతాల్లో చేపడుతున్న మాంగ్రోవ్ అటవీ పెంపకం, నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమాలను “బ్లూ కార్బన్” ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే అంశంపైనా దృష్టి సారించారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. “వసుదైక కుటుంబం” భావనతో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మోడల్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తామని తెలిపారు. కామన్వెల్త్ దేశాలతో కలిసి సౌత్-సౌత్ జ్ఞాన మార్పిడి, పర్యావరణ ఆర్థిక వనరుల సమీకరణ, ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రతినిధి బృందం కట్టుబడి ఉంద”ని ఆయన స్పస్టం చేశారు.
కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ”గ్లోబల్ సౌత్ దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రకృతితో సహజీవనం చేసే సంప్రదాయ జ్ఞానం వాటికి ఉంద’ని అన్నారు. భారతదేశంలో అమలు చేస్తున్న ఈ ప్రజాధారిత నమూనాను ఇతర దేశాలకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.