హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఇవాళ బోరబండలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయంలో జమ్మి మొక్కను, మసీదులో రేగు మొక్కను, చర్చిలో క్రిస్మస్ ట్రీని ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి బాబా ఫసీయుద్దీన్ నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. సర్వమతాల సమ్మేళనం మన హైదరాబాద్ అని కొనియాడారు. పీర్ల పండుగకు హిందువులు దట్టీలు కడుతారు. హిందువుల పండుగకు ముస్లీంలు దట్టీలు కడుతారు. క్రిస్మస్ పండుగకు అందరూ కలిసి స్వీట్లు పంచుకుంటారు. ఈ సోదర సంస్కృతికి మనందరం గర్వించాలని అన్నారు. మనం చేసే ప్రతీ పనిలో మన సంస్కృతిని భాగం చేయాలనే తలంపుతో ఇవాళ అన్ని మాతాల ఆలయాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను భాగం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు.