వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 18 : దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గ్రీన్ చాంపియన్ అవార్డుకు సంగారెడ్డి వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల ఎంపిక కావడం అభినందనీయమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు అన్నారు. బుధవారం తన కార్యాలయంలో వారిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో స్వచ్ఛత, వాటర్ మేనేజ్మెంట్, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల అమలు తీరును బట్టి గ్రీన్ చాంపియన్ అవార్డుకు ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ అవార్డును మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతులమీదుగా అందజేశారన్నారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారులు డాక్టర్ పి.రమేశ్, డాక్టర్. డి.అనిల్ను బుధవారం రాజేంద్రనగర్లోని పరిపాలన భవనంలో అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్కుమార్, డీఎస్ఏ డాక్టర్ జె.సత్యనారాయణ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ సీమ పాల్గొన్నారు.