కాగితాలకే పరిమితమవుతున్న కేటాయింపులు.. గడిచిన రెండేండ్లుగా నిధుల కొరతతో కునారిల్లుతున్న జీహెచ్ఎంసీ.. వెరసి మూడుగా ఏర్పడిన నగర పాలక సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గడిచిన రెండేండ్ల కాలంలో ఏటా దాదాపు రూ. 3వేల కోట్ల కేటాయింపులతో భారీగా కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఇందులో సగంలోపు మాత్రమే అందుతున్న నిధులు.. మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే ఒక్క ప్రాజెక్టు చేపట్టిన దాఖలాలు లేవు. దీనికి తోడు మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్వహణ, వరద నీటి కాలువలు వంటి కీలక పనులు మూలనపడ్డాయి. ఈ క్రమంలోనే పరిపాలన సౌలభ్యం పేరిట బల్దియాలోకి నగర శివారు 27 పురపాలికలను విలీనం చేసి గ్రేటర్ను మూడు విభాగాలుగా విభజించిన నేపథ్యంలో, నూతనంగా ఏర్పాటైన కార్పొరేషన్లకు కార్యాలయాలు, సిబ్బంది, మౌలిక వసతుల కోసం భారీగా నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కనీసం రూ.11 వేల కోట్లు కేటాయించాలని ముగ్గురు కమిషనర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2026-27 వార్షిక బడ్జెట్లో తమకు తగిన ప్రాధాన్యం దకుతుందని మూడు కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మలాజి గిరి) కమిషనర్లు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి. విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా, పాత బడ్జెట్తో నెట్టుకురావడం అసాధ్యమని అధికారులు వాపోతున్నారు. ఒకవేళ కేటాయింపులు ఆశాజనకంగా లేకపోతే పౌరుల సమస్యలు మరింత జటిలమయ్యే ప్రమాదం
ఉందన్న ఆందోళన నెలకొంది.
– సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ)
పట్టాలెక్కని ప్రాజెక్టులు
హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం.. గతేడాది బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు.. కానీ ఆచరణలో మాత్రం ముఖ్యమైన ప్రాజెక్టు ఏ ఒక్కటీ పట్టాలెక్కలేదు..హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి పేరిట కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీ పథకాల స్థానంలో కాంగ్రెస్ సర్కారు ‘హెచ్ సిటీ’(హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కి రూపకల్పన చేసింది కానీ ఆచరణలో మాత్రం అందుకు తగ్గట్లుగా నిధుల కేటాయింపులు జరపలేదు.. ఫలితంగా రెండేళ్లుగా హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. పురోగతిలో ఉన్న ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, ఇతర ఇంజినీరింగ్ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయలేకపోయింది. మరోవైపు కేటాయించిన బడ్జెట్లో పావు వంతు కూడా నిధులు మంజూరు చేయలేకపోవడం సర్కార్కు ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.
అప్పులతో బండెడు కష్టాల్లో జీహెచ్ఎంసీ
జీహెచ్ఎంసీ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఏ పని చేయాలన్నా కూడా అచితూచి ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపుగా రూ. 5500 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయింది. దీనికి తోడు దాదాపుగా రూ. 1400 కోట్ల మేర కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో బకాయి పడింది. అంటే సుమారు రూ. 7వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. హెచ్ సిటీ రూపంలో రూ.3250, సీఆర్ఎంపీ రూ.993.98కోట్లు, ఎస్ఎన్డీపీ రూ.195 కోట్లు, జేఎన్ఎన్యూఆర్ఎం హడ్కో లోన్ రూ.92కోట్ల మేర ఉంది. వీటికి తోడు ప్రతి నెల రూ.200 కోట్ల మేర బ్యాంకులకు కిస్తీ కడుతున్నది. మొత్తంగా గడిచిన రెండేళ్లుగా అరకొర నిధుల మంజూరుతో అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుండగా, నెలవారీ ఉద్యోగుల జీతాలకు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో ప్రభుత్వ బడ్జెట్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

లాకున్న రూ.2వేల కోట్ల సంగతేంది?
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి ఆరేండ్లుగా రావాల్సిన స్టాంపు డ్యూటీ రూ.3030 కోట్లను గతేడాది జనవరి నెలలో రిలీజ్ చేసింది. మొత్తం రూ. 3169 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో స్టాంప్ డ్యూటీకి సంబంధించి రూ. 3030 కోట్లు, మ్యూటేషన్ ఫీజుల కింద రూ. 139 కోట్లు రావాల్సి ఉండగా, ఇందులో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని బల్ధియా పర్సనల్ డిపాజిట్స్ (పీడీ) అకౌంట్లో జమ చేసింది. అయితే ఈ నిధులను రెవెన్యూ ఖర్చు కోసం మాత్రమే వినియోగించాలని నిబంధన పెట్టింది. డెవలప్మెంట్కు ఒకేసారి వాడుకునేందుకు వీలులేకపోవడం, ఉద్యోగుల జీతాలు, మెయింటనెన్స్ లోన్ల రీ పేమెంట్స్ కోసం వినియోగించారు. మొత్తంగా రూ. 1000 కోట్లను మాత్రమే వినియోగించుకున్నారు.
ఇంకా నెలవారీగా ఈ నిధులను రెవెన్యూ ఖర్చులకు వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్న తరుణంలో, కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా సర్కారు బల్దియా నుంచి ఈ నిధులను వెనక్కి తీసుకొని కోలుకోని షాక్కు గురి చేసింది. ఉన్న ఫళంగా రూ. 2వేల కోట్లకు పైగా లాగేసుకున్న తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐతే చేతిలో ఉన్న నిధులను ఖర్చు చేసుకోకుండా చేయడమే కాకుండా వెనక్కి తీసుకుని హైదరాబాద్ నగరాభివృద్ధిపై సర్కార్కు ఉన్న చిత్తశుద్ధికి అద్దంపడుతున్నదని ఆరోపిస్తున్నారు.