మారేడ్పల్లి, నవంబర్ 16: సికింద్రాబాద్ గురుద్వారా మందిర్లో మంగళవారం సిక్కుల మత గురువు గురునానక్ 552 జయంతి ఉత్సవాలు (ప్రకాశ్ ఉత్సవాలు) ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నగర్ కీర్తన్ పేరుతో శోభాయాత్రను అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సిక్కు యువత చేసిన మార్షియల్ ఆర్ట్స్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సిక్కుల మత గ్రంథాన్ని అందంగా ముస్తాబు చేసిన భారీ వాహనంలో ఉంచి ఆధ్యాత్మిక పాటలు పాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపు సాగింది. సికింద్రాబాద్ గురుద్వారా మందిర్ నుంచి ఊరేగింపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రామకృష్ణ హోటల్, సంగీత్ చౌరస్తా, వైఎంసీఏ, క్లాక్ టవర్, సెయింట్ మేరీస్ రోడ్ మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురికి ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ గురుద్వారా సాహిబ్ ప్రబంధక్ కమిటీ అధ్యక్షులు బల్దేవ్ సింగ్ బగ్గా, ప్రధాన కార్యదర్శులు అవతార్ సింగ్, జగ్ మోహన్సింగ్, కార్యదర్శి ఆర్పిత్ సింగ్ గులాటీ పాల్గొన్నారు.