సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తేతెలంగాణ) : పుస్తకం జ్ఞానాన్ని పెంచుతుంది.. మనిషి వికాసానికి చక్కటి నేస్తం..పుస్తకం తోడుంటే గురువు తోడున్నట్లే.. మనిషి ఉన్నతికి పుస్తకమే దోహదం..ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పుస్తకాలకు నేటికీ ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సమయంలో సమాచార సేకరణ, మార్పిడి వేగంగా సాగుతోంది. డిజిటల్ యుగంలో కూడా పుస్తకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. కితాబ్ లవర్స్ ఆధ్వర్యంలో ‘లోడ్ ద బుక్స్’ పేరుతో పంజాగుట్టలోని గ్యలేరియా మాల్లో గురువారం నుంచి పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈనెల 24వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలో సుమారు 2 లక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ప్రవేశం ఉచితం. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది.
అన్నిరకాల పుస్తకాలు లభ్యం
ఈ బుక్ఫెయిర్లో సుమారు 2 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సాహిత్యం, కథలు, క్రైం, పాలిటిక్స్, విదేశీ సంబంధాలు, వైల్డ్లైఫ్, ఫొటోగ్రఫీ, ఎన్సైక్లోపీడియా, రొమాన్స్, ఫాంటసీ, రిలీజియన్ అండ్ సైన్స్, కుకింగ్, బయోగ్రఫీ, చిల్డ్రన్, నాన్ఫిక్షన్ తదితర వాటికి సంబంధించిన అన్నిరకాల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. 10 నుంచి 13 పుస్తకాలతో కూడిన ఓ బాక్స్ను ఏర్పాటు చేసి దాని ధర రూ.999గా నిర్ణయించారు. 17 నుంచి 20 బుక్స్తో ఉన్న వెల్త్బాక్స్ను రూ.1499గా నిర్ణయించారు. 33 పుస్తకాలతో కూడిన ట్రెసర్ బాక్స్ ధర రూ.2,499 నిర్ణయించారు. విడివిడిగా కొనుగోలు చేస్తే వాటి ధరలు వేరేరకంగా ఉంటాయి.
పుస్తక పఠనంతోనే..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రధానంగా నేటి యువతలో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గుతుందని సాహితీవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుస్తక పఠన ప్రాముఖ్యత తెలియజేయడానికి బుక్ఫెయిర్లు ఉపయోగపడుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి పుస్తకాలు చదవాలి? ఎందుకు కొనుగోలు చేయాలి? ప్రముఖ రచయితలు ఎవరు? తదితర సందేహాలతో చాలామంది పుస్తక అభిమానులు ఇబ్బంది పడుతుంటారు. వారికోసం ఈ బుక్ఫెయిర్లో కొన్ని సూచీ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఏయే విభాగంలో ఏయే పుస్తకాలు ఎక్కువ కొనుగోలు అయ్యాయోనన్న సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతారు. ముఖ్యంగా ప్రముఖ రచయితలు షేక్స్పియర్, రుస్కిన్బాండ్, ఆర్థన్ పాముక్ పుస్తకాలను అమ్మకానికి ఉంచారు. విభిన్న భాషల్లో సాహిత్యమంతా ఒకేచోట దొరుకుతుంది. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని రచయితలు సూచిస్తున్నారు.
హైదరాబాదీలకు చాలా ఇష్టం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుక్ఫెయిర్ నిర్వహిస్తున్నాం. ఇది నగరంలో మూడో ఫెయిర్. హైదరాబాద్లో పుస్తక పఠనంపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. దేశంలో ప్రముఖ నగరాల్లో బుక్ఫెయిర్లు నిర్వహిస్తుంటాం. విభిన్నభాషల్లో మంచి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అనేక రాయితీలు కూడా కల్పిస్తున్నాం. బుక్ఫెయిర్ గురించి మరిన్ని వివరాలకు 8860525525 ను సంప్రదించాలి.
–హరిప్రీత్సింగ్ చావ్లా, ఆర్గనైజర్, కితాబ్ లవర్స్ బుక్ఫెయిర్