హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేక పోయాం.
ఈ నెల 17 న సికింద్రాబాద్ మహంకాళి, 24 న ఓల్డ్ సిటీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.18 న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25 న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు ఉంటుందన్నారు.
ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు గతంలో కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.