దుండిగల్, ఆగష్టు 26: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో నేడు ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయిని, వాటిని విద్యార్థులు అందిపుచ్చుకుని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నమస్తే తెలంగాణ దిన పత్రిక సంపాదకులు తిగుళ్ల కృష్ణమూర్తి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల 15వ స్నాతక వేడుకలు శనివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నదన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుందన్నారు. తమ విద్యార్థులను ఐటీ ఉద్యోగులుగా తీర్చిద్దిడంలో ఎంఎల్ఆర్ఐటీ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదన్నారు.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కళాశాల సెక్రెటరీ, కంటోన్మెంట్ అసెంబ్లీ, మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తమ కళాశాల 2005లో ప్రారంభం కాగా, ఇప్పటి వరకు సాంకేతిక విద్యా రంగంలో తెలంగాణ, ఏపీలలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఒకటిగా అవతరించడం గర్వంగా ఉన్నదన్నారు. ఇప్పటివరకు 15వేల మందికి పైగా విద్యార్థు లు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలల్లో ఉద్యోగ అవకాశాలు పొందారన్నారు. అనంతరం, 2019 – 23 బ్యాచ్కు చెందిన 1123 మంది వివిధ విభాగాలల్లో బీ-టెక్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో గౌరవ అతిథులుగా ఎండీ శాంతి కుమార్, ఐబీఐ గ్రూపు టాలెంట్ అక్విజిషన్ లీడ్ హార్ధిక్ షా, కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, డైరెక్టర్ అను శ్రేయారెడ్డి, ప్రిన్సిపాల్ డా. కే శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు.