నాడు మోడీ పిలుపు నిచ్చారు.. నేడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమలు చేశారు. ఇదేమిటి అనుకుంటున్నారా.. నాడు కేంద్రంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెరిగిన ధరలకు నిరసనగా నరేంద్ర మోడీ ఓటు వేసే ముందర గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకుని ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అదే సీన్ మోడీకి వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్ అమలు చేశారు. దీనికి పట్టభద్రులు విశేషంగా స్పందించడంతో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది.
సిటీబ్యూరో, మార్చి 14 ( నమస్తే తెలంగాణ ) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ హాట్ టాపిక్గా మారింది. పట్టభద్రులంతా సిలిండర్కు దండం పెట్టి ఓటింగ్లో పాల్గొనడం సర్వత్రా చర్చనీయంగా మారింది. మంత్రి కేటీఆర్ షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం “ఇంట్లో గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకుని వచ్చి ఓటు వేశా.” అని ప్రకటించారు. ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ప్రతి ఒక్క పట్టభద్రుడు మంత్రి కేటీఆర్ను అనుసరించారు. తమ ఇండ్లల్లో ఉన్న గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకుని ఓటింగ్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టింగ్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్లలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బంక్లను మొక్కుతున్న ఫొటోలు హోరెత్తాయి. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పట్టభద్రులు బీజేపీపై తమ నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశారు.
గతంలో కేంద్రంలో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ గ్యాస్ ధరలను పెంచడంతో.. నరేంద్ర మోడీ ఓటు వేసే ముందర గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకుని ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అదే సీన్ మోడీకి వ్యతిరేకంగా అమలు చేశారు. కేంద్రం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచడంతో ఓటర్లు దండం పెట్టుకుని ఓటింగ్లో పాల్గొన్నారు. పట్టభద్రులంతా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన కేంద్రంపై తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వినూత్నంగా వ్యక్తం చేసి బీజేపీకి చురకలు అంటించారు.