బ్యాగ్ బరువు తగ్గించేందుకు కలిపి ముద్రణ
జిల్లాలో 60 శాతం పాఠ్య పుస్తకాలు పంపిణీ
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 1,96,303 విద్యార్థులు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వారికి 11,25,888 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే, వాటిలో బుధవారం వరకు 6,43,030 పుస్తకాలను జిల్లాకు పంపిణీ చేసినట్లు పాఠ్యపుస్తకాల ముద్రణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసచారి తెలిపారు. ఇప్పటి వరకు 60 శాతం పుస్తకాలు పంపిణీ చేశామని, మరో 4,22,190 పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉన్నదన్నారు.
పేపర్ కొరత ఉండటం వల్ల పుస్తకాల ముద్రణలో కొంత జాప్యమవుతున్నదని, ఈ నెలాఖరు వరకు అన్ని స్కూళ్లకు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే, 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అందించే ఉచిత పుస్తకాలను బహుభాషల్లో ముద్రించినట్లు తెలిపారు. ఒకే పుస్తకంలో ఇంగ్లిష్ మీడియంతో పాటు ఇంగ్లిష్ మీడియం పాఠాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. లాంగ్వేజీలకు సంబంధించి మాత్రమే వేర్వేరుగా ముద్రించినట్లు తెలిపారు. తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియం పాఠాలను ఒకే పుస్తకంలో ముద్రించడంతో బరువు తగ్గుతుందని, దీంతో పార్ట్-1, పార్ట్-2గా బైలింగ్విల్ విధానంలో పాఠ్యపుస్తకాలను ముద్రించినట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు సమ్మేటివ్-1 వరకు ఒక పార్ట్, సమ్మేటివ్-2 వరకు రెండో పార్ట్గా పుస్తకాలను విభజించామని, విద్యార్థులు పుస్తకాలను స్కూల్కు తీసుకురావడానికి తేలికగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు విద్యా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.