రవీంద్రభారతి, ఫిబ్రవరి 28 : మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతుందని, మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉన్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం రవీంద్రభారతిలోని ప్రధాన మందిరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 16వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్, ఉపకులపతి ఆచార్య తంగెడి కిషన్రావు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళాకృష్ణకు మొదటి గౌరవ డాక్టరేట్ పట్టాను అందజేశారు.
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ హైదరాబాద్, వరంగల్, శ్రీశైలం, రాజమండ్రి కేంద్రాలకు చెందిన ఎంఫీల్, పీహెచ్డీ పరిశోధనలు చేసిన వారికి పట్టాలు, స్వర్ణపథకాలు అందజేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలు దేశ విదేశాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నారన్నారు. తెలుగు భాష-సంస్కృతి అందరికీ చేరేలా అధ్యాపకులు కృషిచేయాలన్నారు. సామాన్యులు చదివేలా చిన్న చిన్న పుస్తకాలను ముద్రించాలని సూచించారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఎన్ఈపీ విద్యాలయాలను ప్రారంభించాలన్నారు. తెలుగులో మాట్లాడడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం గవర్నర్ తమిళిసై, ఉపకులపతి కిషన్రావు 11 మందికి గౌరవ డాక్టరేట్లు, 78 మందికి ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు, పీజీ, యూజీ పూర్తి చేసిన 31మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.