Governor | హైదరాబాద్, మార్చి 15 : రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా వైద్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ సర్జరీ వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటిగ్రేషన్ వంటి అత్యాధునిక వైద్య విధానాలు, ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స తదితరు అంశాలపై “హైదరాబాద్ ఆర్థ్రోస్కోపీ కాన్క్లేవ్-2025” పేరిట బంజారాహిల్స్ లోని పార్క్ హయత్లో ఏర్పాటుచేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా తెలంగాణ గవర్నర్ మాట్లాడుతూ… ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ వినియోగాన్ని అన్ని రంగాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాధాన్యత ఇటీవల వైద్య రంగంలో బాగా పెరిగిందన్నారు. భారతదేశం క్రీడా రంగంలో దూసుకుపోతుందని, స్పోర్ట్స్ గాయాలతో ఇబ్బందులు పడే ఆటగాళ్లకు లేటెస్ట్ చికిత్సలను గుర్తించాలన్నారు. ఆర్థ్రోస్కోపీపై జరుగుతున్న ఈ అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్ లో యువ ఆర్థోపెడిక్ వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ… ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సలో అత్యాధునిక పద్ధతులు, పురోగతిపై దృష్టి సారించే ఈ అంతర్జాతీయ సదస్సు , లైవ్ వర్క్ షాప్, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు. కీళ్ల సంబంధిత సమస్యలను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగించే మినిమల్లీ ఇన్వాసివ్ సర్జికల్ ప్రక్రియ అయిన ఆర్థ్రోస్కోపీ, ఆర్థోపెడిక్ సర్జరీలు చేసే విధానాన్ని విప్లవాత్మకంగా మర్చివేసిందన్నారు. ఈ సదస్సులో అత్యాధునిక రోబోటిక్ సహాయం, ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, ఇంటిగ్రేషన్ వంటి అత్యాధునిక వైద్య విధానాల ద్వారా అనేక ఆర్థోపెడిక్ సర్జరీలు విజయవంతంగా ఏలా నిర్వహించాలో ఈ సదస్సుకు హాజరైన 600 మందికి పైగా యువ సర్జన్లకు లైవ్ సర్జికల్ వర్క్ షాప్ ద్వారా వివరించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 60 మందికి పైగా ప్రముఖ అంతర్జాతీయ జాతీయ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ స్పోర్ట్స్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, డాక్టర్. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి తదితరులు పాల్గొన్నారు.