మాదాపూర్, ఫిబ్రవరి 2: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 4.58 కోట్ల 50 వేల అంచనా వ్యయంతో, హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో రూ. 4.37 కోట్ల 20 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హఫీజ్పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత గౌడ్తో పాటు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ప్రభుత్వం అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదనే లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల మార్గనిర్ధేశంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు, ఇందులో భాగంగా సీసీ రోడ్డు, యూజీడీ, వరద నీటి కాలువల వంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని, మరికొన్ని ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను దశల వారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తూ కాలనీలను అద్దంలా తీర్చిదిద్దుతానని చెప్పారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి సకాలంలో పనులను పూర్తి చేయాలన్నారు.