మియాపూర్, ఫిబ్రవరి 5: నియోజవర్గాన్ని పూర్తి స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించటమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఇందుకోసం ప్రణాళికా బద్ధంగా నిరంతర కృషితో ముందుకు సాగుతున్నామన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.2 కోట్ల 50 లక్షలకుపైగా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాభివృద్ధిలో సీఎం కేసీఆర్, కేటీఆర్ల తోడ్పాటు మరువలేనిదని, అధిక నిధులను మంజూ రు చేస్తూ ప్రోత్సహిస్తున్నందున ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా వరద నీటి కాలువల నిర్మాణం, మురుగు సమస్య పరిష్కారానికి పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన రవా ణా సౌకర్యం కోసం ప్రతీ వీధిలో పక్కా రహదారులు, తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకాలతో ప్రజలకు పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు.
క్షేత్రస్థాయిలో సమస్యలతో పాటు ప్రజావసరాలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి యుద్ద ప్రాతిపదికన చర్య లు చేపడుతూ అభివృద్ధి పనులను ముమ్మరంగా చేపడుతున్నామని విప్ గాంధీ పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి తన పూర్తి తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, సమ్మారెడ్డి, శ్రీనివాస్యాదవ్, గణేశ్, చంద్రకాంత్రావు, రామకృష్ణ గౌడ్, కాశీనాథ్, రాజేశ్, శ్రీనివాస్, శివరాజ్, వెంకట్, లక్ష్మమ్మ, శశికళ, ఖైసర్, ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ సుభాష్చంద్రబోస్ నగర్లో సీడీపీ, కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.4 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్, ఏసీపీ గంగారం, సీఐ సైదులు, ఎస్ఐ శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయన్నారు. ఎన్నో నేరాలలో నిందితులను గుర్తించి కఠిన శిక్షలు పడటంలో సీసీ కెమెరా దృశ్యాలు ఉపకరించాయని విప్ గాంధీ అన్నారు. ప్రతీ కాలనీలో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలలో అవగాహనకు పోలీసుల కృషి అభినందనీయమని విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.