వచ్చేది వర్షాకాలం.. పైగా మే నెలలోనే ఉన్నట్టుండి కురుస్తున్న కుండపోత వానలతో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వరద ముంపు తప్పించాల్సిన జీహెచ్ఎంసీ మాత్రం ఇంకా మొద్దు నిద్ర వీడటం లేదు.
మాన్సూన్ పనులే కాకుండా.. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలాల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) మొదటి దశ పనులపైనా నిర్లక్ష్యం చూపుతున్నది. 75 శాతం పైగా పనులను పూర్తి చేసి వందల కాలనీలు, బస్తీలకు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపింది గులాబీ సర్కారు..కానీ డిసెంబర్లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ప్రభుత్వ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపడంతో పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయలేక బల్దియా చేతులెత్తేసింది.
– సిటీబ్యూరో, మే 19, (నమస్తే తెలంగాణ)
ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది వేసవిలో దాదాపు రూ. 45 కోట్ల ఖర్చుతో రూ.884.15 కిలోమీటర్ల మేరలో నాలా పూడిక పనులను చేపట్టాలని నిర్ణయించి, మే 31 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అయితే ఇప్పటి వరకు సగం పనులు కూడా పూర్తి కాలేదు. ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలో ఏ ఒక్క జోన్లో 50 శాతం కూడా పనులు పూర్తి చేయలేదని, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లింపులు లేకనే పనులు నత్తనడకన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఖైరతాబాద్ జోన్లోని ఐదు సర్కిళ్లు మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ఉండగా, రూ.10.73కోట్లతో 63 పనులు చేపడుతున్నారు.
171.256 కిలోమీటర్లలో 53.96 కిలోమీటర్లు పూర్తి చేశారు. నిర్దేశిత లక్ష్యంలోగా పనులు పూర్తి కావడం కష్టమేనని స్వయంగా ఇంజినీర్లలో చర్చ జరుగుతున్నది. బల్కాపూర్ నాలా డిసిల్టింగ్కు సంబంధించి మొత్తం 9.64 కిలోమీటర్లలో 4 కి.మీలు మాత్రమే పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సంస్థ పరిధిలో దాదాపు రూ.1350 కోట్ల బకాయిలు ఉన్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు పనులు చేపట్టబోమని కాంట్రాక్టర్లు అల్టిమేటం జారీ చేస్తూ సమ్మె బాట పట్టారు. ఈ ప్రభావం తాజాగా మాన్సూన్ పనులపై పడుతోంది. సకాలంలో పనులు పూర్తికాకపోతే.. వచ్చే వర్షాకాలంలో వరద ముంపు సమస్యలు తప్పేలా లేవు.
ఎస్ఎన్డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో పనులు పూర్తి కాకపోతే వర్షాకాలంలో ముంచెత్తే వరద నీటితో బతుకులు అస్తవ్యస్తమయ్యే పరిస్థితులు ఉంటాయన్న భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్ మాసంలో వరుణుడి బీభత్సం తర్వాత వరద నీటికి శాశ్వత చర్యలు చేపట్టాలని భావించి..ఎస్ఎన్డీపీ తొలి విడత పథకం ద్వారా రూ. 985.45కోట్లతో 58 చోట్ల నాలా అభివృద్ధి పనులకు శ్రీకారం చూట్టింది.
పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.531కోట్లతో 35 ప్రాంతాల్లో వేలాది కాలనీల వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎస్ఎన్డీపీ పనుల పురోగతిపై సమీక్షించిన దాఖలాలు లేవు. ఖజానాలో డబ్బుల్లేక కాంట్రాక్టర్లకు చెల్లింపులను నిలిపివేశారు. చాలా చోట్ల గోడలు, స్లాబుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా రూ. 394.65 కోట్లతో 20 చోట్ల జరుగుతున్న పనులపై తీవ్ర ప్రభావం పడింది.
వచ్చే వర్షాకాలం నాటికల్లా ఈ పెండింగ్ పనులు పూర్తి కాకపోతే సరూర్నగర్, నాగోల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట హయత్నగర్, వనస్థలిపురం, హబ్సిగూడ, ఉప్పల్ రామంతాపూర్తో పాటు శివారు ప్రాంతాలైన బడంగ్పేట, జల్పల్లి, పెద్ద అంబర్పేట, మీర్పేట ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో రూ.747.45కోట్లతో 37 ప్రాంతాల్లో పనులకు ఎస్బీఐ ద్వారా రూ. 515.96 కోట్ల రుణం తీసుకోగా…మిగిలిన రూ. 231.81 కోట్ల నిధులను జీహెచ్ఎంసీ సమకూర్చాల్సి ఉంది. జీహెచ్ఎంసీ అవతల రూ.238 కోట్లతో 21 చోట్ల జరిగే పనులకు శివారు మున్సిపాలిటీలు నిధుల భారం భరించాల్సి ఉంటుంది. మొత్తంగా నిధుల అడ్డంకితో నాలా అభివృద్ధి పనుల పురోగతి ప్రశ్నార్థకంగా మారింది.
వర్షాకాలం ప్రారంభానికి ముందే నాలాకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ ద్వారా అభ్యర్థించారు. గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వానలతో నాలాలు పొంగిపొర్లి ప్రజలకు అసౌకర్యం తలెత్తుతున్నదన్నారు. దీనికి తోడు కాంట్రాక్టర్లు పాటిస్తున్న బంద్తో నిర్వహణ పనులపై తీవ్ర ప్రభావం చూపి.. ప్రజల ఇబ్బందులు అధికం అయ్యే అవకాశాలున్నాయన్నారు. ఎర్లీబర్డ్ స్కీంలో భాగంగా ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ. 900కోట్లకు పైగా నిధులు సమకూర్చుకున్నారని, ప్రజలు సహకరిస్తున్నప్పుడు , వారికి అవసరమైన పౌర సదుపాయాలను జీహెచ్ఎంసీ ఎందుకు అందించడం లేదని పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బకాయిలు చెల్లించి పనులు ఆగిపోకుండా సకాలంలో వాటిని పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆయన కోరారు.