-పుప్పాలగూడ కాంధీశీకుల భూముల్లో ఆక్రమణల తొలగింపు
మణికొండ : నగర శివారు ప్రాంతంలోని విలువైన సర్కారు భూముల పరిరక్షణ కోసం రెవెన్యూ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇటీవల పుప్పాలగూడలోని కాంధీశీకుల భూమిపై సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా కొంతమంది వ్యక్తులు అక్రమంగా తిష్టవేసి సర్కారు భూమిలో గుడిసెలు, చిన్నపాటి గోదాంలను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో రెవెన్యూ శాఖ అధికారులు వీరందరికీ నోటీసులు జారీచేసినా స్పందించకపోవడంతో అధికారులు విలువైన భూముల పరిరక్షణలో భాగంగా చదునుచేసే పనులను శివారు ప్రాంతాలల్లో వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా మొదటి విడతగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ గ్రామ సర్వేనెంబరు 301 నుంచి 303 నుంచి 325 నుంచి 328లలోని వంద ఎకరాల కాంధీశీకుల ప్రభుత్వ భూమిని చదునుచేస్తున్నారు. ఈ భూమిలో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, ఇతరత్రా చిన్నపాటి గుడిసెలు, అక్రమంగా తిష్టవేసిన ఆక్రమణదారులను బయటకు పంపించేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పుప్పాలగూడలో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, ఆర్డీవో కె.చంద్రకళ, తహశీల్దారు రాజశేఖర్లు పరిశీలించారు. విలువైన భూములను అన్యక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పుప్పాగూడలోని కోట్లాది రూపాయల విలువైన భూముల కోసం తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కాంధీశీకుల భూములపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత సర్కారుకు అనుకూలంగా తీర్పువచ్చిందని అధికారులు తెలిపారు. మొత్తం 198 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదిగా సుప్రీంకోర్డులో విజయం సాధించిన అనంతరం అప్పటి రెవెన్యూ అధికారులు ఈ భూముల చుట్టూ ఫెన్సింగ్ నాటించినా కొంతమంది వ్యక్తులు అక్రమదారిలో భూముల్లోకి చొరబడి వివాదాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఆక్రమణలను తొలగించి అభివృద్ది చేయాలని సర్కారు
యోచిస్తున్నట్లు తెలిసింది.
అభివృద్ది భాధ్యతలు హెచ్యండీఏకు…
నగర శివారు ప్రాంతంలోని పుప్పాలగూడ కాంధీశీకుల భూములను పూర్తిస్థాయిలో అభివృద్ది చేసే పనులను హెచ్యండీఏ శాఖకు అప్పగించేందుకు సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. నగరానికి అతిచేరువలో ఉన్న ఈ భూములను అత్యున్నంతగా రోడ్లను వేసి మొక్కలను నాటి అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అయితే మొదటి విడతగా వంద ఎకరాలను అభివృద్ది చేసేందుకు రూపకల్పన చేశారని అధికారులు వివరించారు. అనంతరం వివిధ అంతర్జాతీయ కంపెనీలకు లీజుకు కేటాయించనున్నట్లు తెలిసింది.