సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు, రోగుల అటెండర్లతో కిందిస్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆయా దవాఖానల అధిపతులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ట్రెషరీ దవాఖానలైన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, ఎంఎన్జేకు నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఈ క్రమంలో రోగి సహాయకులను లోపలికి అనుమతించడం, వైద్య పరీక్షలు, తదితర విభాగాలు, ముఖ్యంగా ప్రసూతి దవాఖానలైన సుల్తాన్బజార్, పేట్లబుర్జ్, నిలోఫర్ దవాఖానల్లో లేబర్ రూంల వద్ద ప్రసూతి మహిళలు, వారి కుటుంబ సభ్యులను అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడం.. ఇవ్వకపోతే దూషిస్తుండటంతో వివాదాలకు దారితీస్తున్నది. వేలాది కోట్లు వెచ్చించి ఖరీదైన వైద్యం అందిస్తూ రోగుల మన్ననలు పొందుతున్న ప్రభుత్వానికి ఇలాంటి ఉదంతాలు మాయని మచ్చగా మారుతున్నాయి. వీటిని నివారించేందుకు ఆయా దవాఖానల్లో రోగులు, వారి సహాయకులతో కిందిస్థాయి సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని.. లేనిచో కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని ప్రభుత్వ దవాఖానల అధికారులు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని దవాఖానల్లో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇందులో భాగంగా దవాఖానల అధిపతులు సంబంధిత ఆర్ఎంఓలు, సెక్యూరిటీ ఏజెన్సీ ఇన్చార్జ్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ ఏజెన్సీ ఇన్చార్జ్లు, డైట్ ఇన్చార్జ్లతో చర్చించినట్లు సమాచారం.
దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు..
రోగులు, వారి సహాయకులతో వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య, ఆరోగ్యశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దవాఖానలోని ఆయా విభాగాల్లో పని చేసే సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది రోగి సహాయకులతో అమర్యాదగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని అంతర్గత సమావేశాల్లో మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
ఫిర్యాదు ఇలా..
రోగులు, రోగి సహాయకులతో దవాఖాన సిబ్బంది దురుసుగా ప్రవర్తించినా, డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయాలని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, పేట్లబుర్జూ సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేందర్, డాక్టర్ రాజారావు, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ మాలతి సూచించారు.