పహాడీషరీఫ్ : తెలంగాణలో చారిత్రక పహాడీషరీఫ్ బాబా షర్ఫుద్దీన్ దర్గాను కులమతాలకు అతీతంగా భక్తులు దర్శించుకుంటారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం ఆయన పహాడీషరీఫ్ దర్గాకు విచ్చేసి అధికారులతో కలిసి ర్యాంపు పనులను పరిశీలించి సమీంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన పహాడీషరీఫ్ దర్గా కులమతాలకు అతీతంగా దర్శించుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. దర్గాపైకి ఎక్కడానికి ఎదురవుతున్నఇబ్బందులను దృష్టిలో పెటుకుని ర్యాంపు ఏర్పాటు కోసం గత మూడు సంవత్సరాల క్రితం రూ. 9 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు.
కరోనా కారణంగా పనులు ఆగిపోయాయన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగడానికి మరో రూ. 6 కోట్లు ప్రభుత్వం కేటాయించింద న్నారు. రెండు విడతల్లో ర్యాంపు పనులు, పార్కు అభివృద్ధి, ఆర్చ్, రెస్ట్ రూమ్స్ పూర్తి చేయిస్తామన్నారు. కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నదీమ్ అహ్మద్, మైనార్టీ అడ్వైజర్ ఎ.కె. ఖాన్, వక్ఫ్ బోర్డు సీఈఓ షహన్వాజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, దర్గా కమిటీ సభ్యులు మోయినోద్దీన్, ఇమ్రాన్, సలీం,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.