హైదరాబాద్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని బస్ భవన్లో సోమవారం ఆయన ఆర్టీసీ పోలీసు సిబ్బంది కవాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో తెలంగాణ ఆర్టీసీ పురోగమిస్తున్నదని పేర్కొన్నారు.
పంద్రాగస్టు కానుకగా ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతభత్యాలతో పాటు ఒక డీఏను అందజేస్తామని చెప్పారు. 1932 నాటి “డెక్కస్ క్విస్” అల్బినియస్ బస్సును ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రదర్శించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు నిజాం కాలం నాటి బస్సు చరిత్రను వివరిస్తామన్నారు. హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రోడ్డు మార్గాలపై నిజాం కాలం నాటి బస్సును ప్రజల సందర్శనార్థం ప్రదర్శిస్తామని చెప్పారు. తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అనేక రాయితీలతో కూడిన నూతన పథకాలు, ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టామని గోవర్ధన్ తెలిపారు. సంస్థను క్రమంగా లాభాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. నా ఇష్టదైవం వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఆర్టీసీ సంస్థ, టీటీడీ బోర్డు సహకారంతో రూ.300 దర్శన టికెట్లను ప్రతిరోజు వెయ్యి మంది ప్రయాణికులకు అందిస్తున్నామన్నారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ.. తార్నాక ఆస్పత్రి కేంద్రంగా సిబ్బంది కోసం మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నామన్నారు. నూతనంగా నర్సింగ్ కళాశాలను, ఒకేషనల్ కోర్సులను ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడుతామని, 300 ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభిస్తామని చెప్పారు.
త్వరలోనే ఆర్టీసీ వాటర్..
75వ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎస్ ఆర్టీసీ అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టినదని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు కమర్షియల్ రెవెన్యూ కోసం త్వరలోనే ఆర్టీసీ జీవ(ZIVA) పేరుతో వాటర్ బాటిళ్లను మార్కెట్లోకి తీసుకు వస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజాం రోడ్డు రవాణా విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, కురవృద్ధులైన టీఎల్ నరసింహ, ఎం.సత్తయ్యను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. టీఎస్ ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్లో మూడు అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్ మేకర్స్కు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. తొలి బహుమతికి రూ.10వేలు, రెండో బహుమతికి రూ.5వేలు, తృతీయ బహుమతికి రూ.3000 నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీవోవో రవీందర్, ఈడీఈ వినోద్, సీపీఎం యుగేందర్, హెచ్వోడీలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.