విజయవాడలో 500 మంది కళాకారులతో ఊరేగింపు
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్లోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆదివారం బంగారు బోనం సమర్పించారు. ఈ కమిటీ వారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఉభయ తెలుగు రాష్ర్టాలలో వర్షాలు విస్తారంగా కురిసి, పాడి పంటలతో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ 13 ఏళ్లుగా అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నామని మహంకాళీ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ పేర్కొన్నారు.
ఈ ఏడాది అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమానికి కమిటీ సభ్యులతో పాటు 500మందికిపైగా కళాకారులు విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం బంగారు బోనంతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. మేళతాళాలు, తీన్మార్ డప్పులు, పోతురాజుల విన్యాసాలు, కోలాటాలు, బేతాళ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్ర్తాలు, ఒడిబియ్యంతో పాటు కృష్ణమ్మ తల్లికి పట్టువస్ర్తాలు, పసుపు కుంకుమ, గంగతెప్పను సమర్పించారు.