మైలార్దేవ్పల్లి : బట్టలు ఉతకడానికి వెళ్లిన వివాహిత ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోపరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మిగూడ రాజీవ్ గృహకల్ప లో బబ్లూ తన భార్య రేష్మ ఆరుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కాగా రేష్మ ఎప్పటి లాగే శుక్రవారం మధ్యాహ్నాం ఇద్దరు పిల్లలతో కలిసి ప్రక్కనే ఉన్న ఉందాసాగర్ (కొత్త చెరువు)లో బట్టలు ఉతకడానికి వెళ్లింది.
ప్రమాదవశాత్తు రేష్మ నీళ్లల్లో పడింది. వెంట ఉన్న ఇద్దరు పిల్లలు తల్లిని కాపాడడానికి చేతులు అందించారు. పిల్లలు కూడా నీటిలో పడిపోయారు. చిన్నారుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే చెరువు వద్దకు వచ్చి చిన్నారులను సురక్షితంగా బయటకు తీశారు. రేష్మ అప్పటికే మునిగి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియ దవఖానాకు తరలించారు.