కొండాపూర్, ఆగష్టు 1: పితృస్వామ్య వ్యవస్థలో, పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్యలు, వాటిని అధిగమించేందుకు సాధించాల్సిన అంశాలను వివరిస్తూ సురభి కళాక్షేత్రం, శిల్పారామంల సంయుక్త నిర్వహణలో ‘గోగ్రహణం’ వీధి నాటికను కళాకారులు ప్రదర్శించిన తీరు అత్యద్భుతంగా ఉంది. ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి రచించిన గోగ్రహణం వీధి నాటికను ఆదివారం మాదాపూర్లోని శిల్పారామం ఆంఫీ థియేటర్లో సురభి కళాక్షేత్రం కళాకారులు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి సినీ నటుడు తనికెళ్ళ భరణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనాదిగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అవమానాలు, శీలాన్ని స్త్రీకి మాత్రమే పరిమితం చేస్తూ పవిత్ర హింసకు, న్యాయమైన దాస్యానికి బలిచేస్తున్న అంశాలను నాటికలో కళాకారులు చక్కగా వివరించారు. ఈ నాటిక ప్రదర్శనకు సురభి కుటుంబ సభ్యుడైన డాక్టర్ రమేష్ సింధే దర్శకత్వం వహించారు.
కళాకారులు అనూరాధ, సురభి దీప్తి, వీణ, తన్మయి, జాహ్నవి, చిరంజీవి, సాయి శుభాకర్, సాయి, వంశీ, సందీప్, సాయిరోహిత్ నటించగా, సహ దర్శకత్వం సురభి సంతోష్, సంగీతం సత్యశ్రీనాథ్, సాంకేతిక సహకారం సురభి ఉమా శంకర్ బృందం, మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ఫణి భూషణ్ బృందం అందజేశారు.