మలక్పేట, డిసెంబర్ 31: పవిత్రమైన మనసుతో ప్రార్థించే ప్రతి హృదయంలో దేవుడు కొలువై ఉంటాడని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మలక్పేటలోని తిరుమల బ్యాంకులో నిర్వహించిన బ్యాంకు సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ… తిరుమల బ్యాంకు అనతికాలంలోనే కస్టమర్ల మన్ననలు పొంది సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. బ్యాంకు చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్ మంచి మనస్సు కలిగిన వేంకటేశ్వర స్వామి భక్తుడన్నారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడని అన్నారు. తెలంగాణ తిరుమల దేవస్థానంగా పేరుగాంచిన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం, బీర్కూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైందన్నారు.
2016 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధికి రూ.23 కోట్లు కేటాయించారని తెలిపారు. ఆలయం చుట్టూ రాజగోపురాలు, మాడ వీధులు, ప్రాకారాలు, కొండ మీదకు రోడ్డు, కల్యాణ మండపం, వసతి గృహాలు, 54 షూట్లు, కల్యాణకట్ట, చెరువును 15 ఫీట్ల లోతుగా తవ్వించి సకల వసతులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జనవరి 26న స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, నాలుగు కిలోల బంగారంతో స్వామివారికి బంగారు కిరీటం చేయిస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అలంకరించనున్నామని తెలిపారు. రూ.వేయి కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశానని, పేదలకు 11 వేల ఇండ్లు ఉచితంగా నిర్మించి ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ క్యాలెండర్తోపాటు, దేవాలయ విశేషాలు తెలియజేస్తూ రూపొందించిన ప్రోమో వీడియోను స్వీకర్ పోచారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల బ్యాంకు చైర్మన్ నంగునూరి చంద్రశేఖర్, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లికార్జున్, శోభ, వెంకట్రాజు, బాలసుబ్రహ్మణ్యం, బ్యాంక్ డైరెక్టర్లు, కస్టమర్లు పాల్గొన్నారు.