బంజారాహిల్స్, మార్చి 12: ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా గ్లకోమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం వాక్ నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో వైద్యులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అంతకుముందు టాలీవుడ్ దర్శకుడు శైలేశ్ కొలను, నటులు ప్రియదర్శి, సుహాస్ తదితరులు జెండా ఊపి వాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి గ్లకోమా కన్సల్టెంట్స్ డా. సిద్ధార్థ దీక్షిత్, డా.శిరీష సెంథిల్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన శిశువు నుంచి అన్ని వయసుల వారికి గ్లకోమా వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. భారతదేశంలో ప్రతి పదిమందిలో ఒకరు గ్లకోమాతో బాధపడుతున్నా వారిలో అవగాహన లేకపోవడంతో ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తున్నారన్నారు. గ్లకోమాను ప్రారంభదశలో గుర్తించగలిగితే చికిత్స సాధ్యమన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
మెహిదీపట్నం మార్చి 12: కంటిలో వచ్చే రోగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెహిదీపట్నం సరోజిని దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం అన్నారు. ఆదివారం వైద్యశాల ఆవరణలో గ్లకోమా వారోత్సవాలను ర్యాలీతో ప్రారంభించారు. ఇందులోభాగంగా వారం పాటు కంటి రోగులకు సంబంధించి పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం తెలిపారు. గ్లకోమా వ్యాధి 38 ఏండ్లు వయస్సు పైబడిన వారికి వస్తుందని, ఇది చాలా నెమ్మదిగా కంటి చూపును హరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ విమల, డాక్టర్లు మోదిని, వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.