అమీర్పేట్: జీహెచ్ఎంసీ వయోధికుల మండలి కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. కొవిడ్ ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వయోధికులు తిరిగి మండలి కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలకు హాజరవుతున్నారు. ఎస్ఆర్నగర్లోని వయోధికుల మండలిలో కొద్ది రోజుల నుండి రోజువారీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వయోధికులంతా ఒక చోట చేరి ఇండోర్ గేమ్స్లో పాల్గొంటూ చక్కటి ఆటపాటలతో తమ సమయాన్ని ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇక ఆధ్యాత్మిక, ఆరోగ్య అంశాలపై కూడా కౌన్సిల్ దృష్టి సారించింది. ప్రతి గురువారం సాయంత్రం సహజకవి, వయోధికుల మండలి ప్రతినిధి డ్యాగ బాల్రాజ్యాదవ్ గీతా ప్రవచనాలు ఆలపిస్తుండగా వయోధికులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. భగవద్గీత శ్లోకాలను అందరికీ అర్ధమయ్యేలా చక్కటి కాలేక్షేపం అందిస్తున్న డ్యాగ బాల్రాజ్యాదవ్ను ఈ సందర్భంగా వయోధికుల మండలి అధ్యక్షులు కాసాని సహదేవ్గౌడ్ ఘనంగా సన్మానించారు.