కేపీహెచ్బీ కాలనీ, మార్చి 16 : వార్షిక యేడాది మరో పదిహేను రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వంద శాతం ఆస్తిపన్నులను వసూళ్లు చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వందశాతం ఆస్తిపన్ను వసూళ్లు చేయలేకపోయిన అధికారులు ఈ యేడాది ఆస్తిపన్ను బకాయిలన్నింటినీ వసూళ్లు చేసే దిశగా చర్యలు చేపట్టారు. కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో పదిహేను రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాన్ని.. రోజువారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆస్తిపన్నులను వసూళ్లు చేస్తున్నారు. డీసీలు, రెవెన్యూ అధికారులు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించారు. డాకెట్ల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించి మొండి బకాయిలను వసూళ్లు చేయడంపై దృష్టిసారించారు. నెలాఖరులోగా అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తున్నాం.
కూకట్పల్లి జోనల్ పరిధిలో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉన్నాయి. ఐదు సర్కిళ్లకు గాను ఈ వార్షిక యేడాది ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.295 కోట్లుగా నిర్దారించారు. ఇప్పటి వరకు జోన్ పరిధిలో రూ.256.76 కోట్లు వసూళ్లు కాగా రూ.38.24 కోట్ల ఆస్తిపన్ను బకాయిలు ఉన్నాయి. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్లో రూ.105 కోట్ల లక్ష్యానికి గాను రూ.89.04 కోట్లు వసూళ్లయ్యాయి. కూకట్పల్లి సర్కిల్లో రూ.84 కోట్ల లక్ష్యానికి గాను రూ.74.63 కోట్లు వసూళ్లు కాగా కుత్బుల్లాపూర్ సర్కిల్లో రూ.46 కోట్ల లక్ష్యానికి గాను రూ.41.52 కోట్లు.. గాజులరామారం సర్కిల్లో రూ.29 కోట్ల లక్ష్యానికి గాను రూ.25.32 కోట్లు.. అల్వాల్ సర్కిల్లో రూ.31 కోట్ల లక్ష్యానికి గాను రూ.26.25 కోట్ల ఆస్తిపన్నులను వసూళ్లు చేశారు. ఈ పదిహేను రోజుల్లో రూ.38.24 కోట్ల ఆస్తిపన్నులు వసూళ్లు చేయాల్సి ఉంది. సర్కిళ్ల వారీగా చూస్తే మూసాపేట సర్కిల్లో రూ.15.96 కోట్ల బకాయిలు, కూకట్పల్లి సర్కిల్లో రూ.9.37 కోట్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో రూ.4.48 కోట్లు, గాజులరామారం సర్కిల్లో రూ.3.68 కోట్లు, అల్వాల్ సర్కిల్లో రూ.4.75 కోట్ల బకాయిలు వసూళ్లు చేయాల్సి ఉంది. ఈ బకాయిలను గడువులోగా వసూళ్లు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
సకాలంలో ఆస్తిపన్ను చెల్లించకుంటే జీహెచ్ఎంసీ రెవెన్యూ చట్టం ప్రకారం రెడ్ నోటీసులను జారీ చేస్తున్నారు. పన్నులను చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న వారి ఆస్తులను గుర్తిస్తూ జప్తు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో ఇప్పటికే మొండి బకాయిల జాబితాను సిద్ధం చేసిన అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. సర్కిళ్ల వారీగా ఆస్తిపన్ను చెల్లించని వారికి ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా నిత్యం సమాచారాన్ని అందిస్తున్నారు. వ్యక్తిగతంగా ఇంటికెళ్లి ఆస్తిపన్ను చెల్లించాలని కోరుతున్నారు. పదిహేను రోజుల్లోగా ఆస్తిపన్ను చెల్లించకుంటే వడ్డీతో సహా ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పెద్దమొత్తంలో బకాయిలున్న వారిని గుర్తిస్తూ ఆస్తులను జప్తుచేసే దిశగా చట్టపరంగా చర్యలు ముమ్మరం చేశారు. జీహెచ్ఎంసీ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ముందస్తుగా ఆస్తిపన్ను బకాయిదారులకు నోటీసులు అందిస్తున్నారు. మొండిగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆస్తిపన్ను విధింపుపై సందేహాలను నివృత్తి చేసేందుకు సర్కిల్ కార్యాలయంలో, వార్డు కార్యాలయాలలో రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు వాటిని నివృత్తి చేస్తున్నారు.
ఆస్తిపన్ను చెల్లించేందుకు ఈ వార్షిక యేడాది గడువు మరో పదిహేను రోజుల్లో ముగుస్తుంది. ఇప్పటి వరకు పన్నులు చెల్లించని వారు వెంటనే ఆన్లైన్లో/ఆఫ్లైన్లో ఆస్తిపన్నులు చెల్లించాలి. పన్నులు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం సాధించేలా పనిచేస్తున్నాం. సర్కిళ్ల వారీగా.. డాకెట్ల వారీగా లక్ష్యాలను పెట్టుకుని ఆస్తిపన్నులను వసూళ్లు చేస్తున్నాం. తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గడువులోగా పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్తులు కావాలని కోరుతున్నాం.
– వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి