పౌరుల భాగస్వామ్యంతోనే పురపాలన లక్ష్యాలు సాధ్యమవుతాయని బలంగా నమ్మే ప్రభుత్వం మనది.. వార్డు కార్యాలయ వ్యవస్థలో ఫిర్యాదులు పెరిగితే దానిని సానుకూలంగా చూస్తాం. ప్రజలకు వార్డు వ్యవస్థపై నమ్మకం పెరిగితేనే ఫిర్యాదులకు వస్తారు. పౌర సేవలను ప్రజలకు అందించే ప్రక్రియను ఎప్పటికప్పుడు మెరుగుపర్చాలి. అవసరమైతే టెక్నాలజీని వాడుకోవాలి. రాబోయే వారాంతంలో భారీ వర్షాలు ఉన్నాయి. సమన్వయంతో పని చేసి పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
– వార్డు కార్యాలయ సమీక్షలో మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ) : వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వార్డు కార్యాలయాలకు నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నదని, ఈ సేవలను పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలన్నారు. గత నెల జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థపైన మంత్రి కేటీఆర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ భవన్లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతోపాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జలమండలి ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల నుంచి వార్డు కార్యాలయ వ్యవస్థకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్నారు.
తమ సమస్యలపైన వార్డు కార్యాలయాన్ని సందర్శించిన పలువురితో తాము స్వయంగా ఫోన్లో మాట్లాడామని, వార్డు కార్యాలయ వ్యవస్థలో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత వేగంగా సమస్యలను పరిషారం చేసేందుకు తాము చేస్తున్న ప్రయత్నంపై ఫిర్యాదు చేసిన పౌరులు సంతృప్తిగా ఉన్నారని, జోనల్, డిప్యూటీ కమిషనర్లు మంత్రి కేటీఆర్కి తెలిపారు. వార్డు పరిధిలో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. దీంతోపాటు స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో కూడా వార్డు కార్యాలయ వ్యవస్థకు మరింత ప్రచారం కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పౌరుల భాగస్వామ్యంతోనే పురపాలన లక్ష్యాలు సాధ్యమవుతాయని బలంగా నమ్మే ప్రభుత్వం మాదని తెలిపిన కేటీఆర్, వార్డు కార్యాలయ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులు పెరిగితే దానిని సానుకూలంగా చూస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్డు కార్యాలయం వ్యవస్థ పనిచేస్తుందన్న నమ్మకం పెరుగుతున్న కొద్దీ ప్రజలు తమ సమస్యలను, వార్డు సమస్యలను ఈ వ్యవస్థ ద్వారా పరిషరించుకునేందుకు ముందుకు వస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. వార్డు కార్యాలయ వ్యవస్థ ప్రారంభ దశలో ఉన్న నేపథ్యంలో ఇంకా అవసరమైన మార్పుచేర్పులు చేసుకొని ముందుకు పోవాలని, కార్యాలయాలకు అవసరమైన టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని మరింతగా బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువచేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అంతర్గత విభాగాలతోపాటు ఇతర శాఖలతో కలిసి వర్షాలతో ఎదురయ్యే పరిస్థితులను ఎదురొనేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులను కోరారు. ఈ ప్రక్రియలో కీలకమైన పారిశుధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అధికారులు పారిశుధ్య కార్మికులతో భోజన సమావేశాలు ఏర్పాటు చేసుకొని, వారి సేవలకు అభినందనలు తెలుపుతూనే, నగర పారిశుధ్యాన్ని మరింతగా మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సుదీర్ఘకాలం పాటు జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి లోకేశ్కుమార్కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. లోకేశ్కుమార్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పన, ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు ఎస్ఆర్డీపీ, లింకు రోడ్ల నిర్మాణం, ఎస్ఎన్డీపీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఆయన కృషికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయిన లోకేశ్కుమార్ను ఆయన శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, నూతన జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.