జీహెచ్ఎంసీ పరిధిలో టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్లకు డిమాండ్ నెలకొంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎల్బీనగర్ ఇలా ప్రాంతాలకు అతీతంగా ఔటర్ రింగు రోడ్డు లోపల భవన ‘ఎత్తు’ నిబంధనను సడలించిన నేపథ్యంలో ఈ టీడీఆర్తో అదనపు అంతస్థుల నిర్మాణాలకు బిల్డర్లు ఆసక్తి కనబర్చుతున్నారు. సంపన్న ప్రాంతాల్లో నిర్మాణం ఎత్తుపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం అదనపు అంతస్థులు నిర్మించలేరు. కానీ ప్రస్తుతం టీడీఆర్ రైట్స్తో అదనపు అంతస్థులు నిర్మించుకునే అవకాశం ఉంది. సొసైటీ స్థలాలు తప్పా అన్ని ప్రాంతాల్లోనూ 40అడుగుల రోడ్డు ఉంటే అదనపు అంతస్థుకు జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తున్నది. కాగా ఇప్పటి వరకు టీడీఆర్ సర్టిఫికెట్స్ను 112మంది కొనుగోలు చేయడం గమనార్హం. ప్రస్తుత భూసేకరణ చట్టం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో భూసేకరణకు మార్కెట్ ధరలో రెండింతల నష్టపరిహారం చెల్లిస్తారు. ఒకవేళ టీడీఆర్ సర్టిఫికెట్ తీసుకుంటే నాలుగింతల మేర లాభం చేకూరుతుంది. ఉదాహరణకు భూసేకరణలో 100గజాల స్థలం పోతే దానికి రూ.50వేల ధర ప్రకారం రూ.కోటి నష్ట పరిహారం వస్తుందనుకోండి. అదే టీడీఆర్లు తీసుకుంటే నాలుగింతల బిల్టప్ ఏరియా లభిస్తుంది. ఈ బిల్టప్ ఏరియాను సదరు భవన యజమాని ఏదైన ప్రాంతంలో అదనపు అంతస్థులు నిర్మించుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.
లేకుంటే ఇతరులకు విక్రయించుకోవచ్చు. వాటిని కొనుగోలు చేసినవారు అదనపు అంతస్థులు నిర్మించుకునే వీలు కలుగుతుంది. నిబంధనల ప్రకారం ఒక ప్లాటులో ఐదు అంతస్థులకు మాత్రమే అనుమతులు మంజూరయ్యే అవకాశం ఉన్నప్పటికీ టీడీఆర్లు తీసుకుంటే అదనంగా మరో అంతస్థుకు అనుమతిస్తారు. అంతేకాకుండా టీడీఆర్లు ఉన్నవారు ఎక్కడైనా నిర్మాణాలకు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండటంవల్ల నగరంలో టీడీఆర్లకు గిరాకీ ఏర్పడింది. దీనివల్ల భూసేకరణ త్వరితగతిన సాగడమే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్పై కూడా ఆర్థిక భారం పడటం లేదు. టీడీఆర్లకు గిరాకీ ఉండటంవల్ల భూ యజమానులు వాటిని సులభంగా విక్రయించుకొని లాభం పొందుతున్నారు.
అందరికీ లాభదాయకం
భూసేకరణ భారం నుంచి ఉపశమనం పొందేందుకు జీహెచ్ఎంసీ టీడీఆర్ను అమల్లోకి తీసుకువచ్చింది. అభివృద్ధి పనులకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమిని సేకరించి, నగదు పరిహారానికి ప్రత్యామ్నాయంగా టీడీఆర్ను ఇస్తున్నారు. కోల్పోయిన భూ విస్తీర్ణానికి నాలుగు రెట్ల భూమిని ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ రూపంలో జీహెచ్ఎంసీ అందజేస్తున్నది. సదరు నిర్వాసితుడు దాన్ని ఔటర్ రింగు రోడ్డు పరిధి వరకు ఎక్కడైనా, ఎవరికైనా, ఎంత మొత్తంలోనైనా డిమాండ్ను బట్టి ఏ ధరకైనా అమ్ముకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తివద్ద 10000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా నిర్మాణానికి టీడీఆర్లు ఉన్నాయనుకుంటే, అతను వాటిని ఎంతమందికైనా విక్రయించుకోవచ్చు. లేకుంటే కొంత విక్రయించుకొని కొంత తన సొంత నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు. శివారులోని స్థలానికి సంబంధించి టీడీఆర్ తీసుకుంటే సంపన్న ప్రాంతాల్లో ఆ టీడీఆర్ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా నిర్వాసితులు లాభపడుతున్నారు. చకచకా అభివృద్ధి పనులు జరుతున్నాయి. జీహెచ్ఎంసీకి గణనీయంగా భూసేకరణ భారం తగ్గుతుంది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఖాజానాకు రూ.1000కోట్లకు పైగా లబ్ధి చేకూరిందని అధికారులు పేర్కొన్నారు.