సిటీబ్యూరో,మే16 (నమస్తే తెలంగాణ) : రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. ఈ మేరకు జూన్ నుంచి అక్టోబరు వరకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రతి ఏటా తరహా ఈ ఏడాది కూడా రూ. 36.98 కోట్లతో ప్రత్యేక బడ్జెట్తో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకుగానూ 168 అత్యవసర బృందాలను రంగంలోకి దింపనుంది. ఈ మేరకు స్టాటిక్ లేబర్ టీమ్లు, మినీ మొబైల్ టీమ్లు, వాహనాలు, మొబైల్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటులో భాగంగా సర్కిళ్ల వారీగా టెండర్లను ఆహ్వానించి ఇప్పటికే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. అలాగే దాదాపు రూ.45 కోట్లతో చేపడుతున్న పూడికతీత పనులను ఈ నెలాఖరు నాటికల్లా పూర్తి చేసే దిశగా చర్యలను వేగిరం చేశారు.
రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. జూన్ నుంచి అక్టోబరు వరకు మాన్సూన్ యాక్షన్ప్లాన్ రూపకల్పనకు స్టాటిక్ లేబర్ టీంలు, మినీ మొబైల్ టీమ్లు, వాహనాలు, మొబైల్ ఎమర్జెన్సీ బృందాల ఏర్పాటులో భాగంగా సర్కిళ్ల వారీగా టెండర్లను ఆహ్వానించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ఏడాది రూ.36.98 కోట్ల వ్యయంతో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నది. కాగా ఇప్పటికే వర్షాకాలం సమీపం ముందే నాలాల పూడిక తీత పనులను తుది దశకు చేర్చారు. దాదాపు రూ.45 కోట్లతో చేపడుతున్న పూడికతీత పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేసే దిశగా చర్యలను వేగిరం చేశారు.
168 అత్యవసర బృందాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకుగాను 168 మాన్సూన్ అత్యవసర బృందాలను రంగంలోకి దింపనున్నది. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్లు ఉంటాయి. మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీంలలో షిప్టుల వారీగా ప్రతి టీంలో నలుగురు కార్మికులు ఉంటారు. ఒక వాహనంతో పాటు గునపాలు, పారలు, నీరు తొలగించే పంపు సెట్లు, భద్రత సాధనాలు, బూట్లు, రెయిన్ కోట్లు, రేడియం జాకెట్లు, గొడుగు, టార్చిలు ఇందులో ఉంటాయి. నీరు నిలిచిపోయిన ప్రాంతాలు, క్యాచ్పిట్ల వద్ద నిలిచిన నీటిని తొలగిస్తారు. దీంతో పాటు ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జితో పాటు ఇద్దరిని కేర్ టేకర్ (పర్యవేక్షకులు)గా నియమించనున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద అంచనా బట్టి దిగువకు చెరువు నీటిని విడుదల చేయడం, ఎప్పటికప్పుడు వరదపై అప్రమత్తంగా ఉండడం లాంటి చర్యలు చేపడుతారు. ఎన్ఎన్డీపీ పనులు జరిగే స్థలాల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా బారికేడ్లు ఏర్పాట్లు, రోడ్లు మూసివేత, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు వంటి వాటిపై దృష్టి సారిస్తారు. ప్రాజెక్టు విభాగానికి సంబంధించి 18 మంది అధికారులను నియమించనున్నారు.