సిటీబ్యూరో: ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2100కోట్ల టార్గెట్ విధించుకోగా.. ఇప్పటి వరకు దాదాపు రూ.1416 కోట్ల మేర మాత్రమే చేరుకున్నారు. 12 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లించగా.. మరో ఐదు లక్షల మంది ఇంకా చెల్లించాల్సి ఉంటుంది. వీరి నుంచి దాదాపు రూ.684 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉంది.
వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఆస్తిపన్ను వసూళ్లను పెంచాలని నిర్ణయించిన అధికారులు.. ఈ మేరకు బకాయిదారులకు వన్టైం సెటిల్మెంట్(OTS) అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ అందిస్తూ ఓటీఎస్ స్కీంను అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమైంది. ప్రతిపాదన కమిషనర్ ఇలంబర్తి పరిశీలనలో ఉంది.
గ్రేటర్లో ప్రస్తుతం ఆస్తిపన్ను బకాయిలు రూ.5వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించిన పన్నులు రూ. 3వేల కోట్లు ఉండగా, రూ. 2 వేల కోట్లు ఆస్తిపన్ను దారుల నుంచి రావాల్సి ఉంది ఓటీఎస్ను అమలు చేస్తే రూ. 500కోట్ల మేర ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా. ఈ నెలాఖరులోగా అధికారికంగా ఓటీఎస్ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే 10శాతం వడ్డీతో బకాయిదారులంతా తమ ఆస్తిపన్నును చెల్లించే వెసులుబాటు దొరుకుతుంది. ఓటీఎస్తో దాదాపు 2 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.