సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): లోతట్టు ప్రాంత ప్రజల కోసం ప్రతి సర్కిల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్షాకాల ఎమర్జెన్సీ కంట్రోల్ రూంను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్ఎంసీతో పాటు జలమండలి, రెవెన్యూ, విద్యుత్, పర్యాటక, పోలీస్ శాఖాధికారులు ఈ కంట్రోల్ రూం ద్వారా పరిస్థితులను సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. 324 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో నీటి నిల్వలను తొలగించేందుకు 200 మోటార్ పంపులను సిద్ధం చేశామన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరంలోని రహదారులపై 3900 గుంతలు ఏర్పడగా వాటిని వెంటనే పూడ్చి వేశామన్నారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం(నంబర్ 040-2 1111 11 1), డయల్ 100, మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వైబ్సైట్ ద్వారా అందిన 296 సమస్యలను వెంటనే పరిష్కరించామని అన్నారు. జీహెచ్ఎంసీ అప్రమత్తతతోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు.