సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : బడ్జెట్ మీద మాట్లాడుదామంటే.. ప్రొటోకాల్ పంచాయితీ తెస్తారు.. అభివృద్ధి గురించి చర్చిద్దామంటే.. బడ్జెట్ ఆమోదం కాలేదంటారు.. ప్రజా సమస్యలను చెప్పమంటే.. పోడియం చుట్టుముడుతారు.. ఇదీ గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్ల తీరు. దాదాపు రెండేండ్లుగా జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు ఐదు కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. సమర్థుడు దొరకడం లేదా? సఖ్యత కుదరడం లేదా? తెలియదుగానీ… బీజేపీ అధిష్ఠానం ఫ్లోర్లీడర్ పదవి భర్తీకి జంకుతున్నది. దీంతో రేసులో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు అటు అధిష్ఠానం మీద తిరుగుబావుటా ఎగురవేయలేక… ప్రజా సమస్యలు చర్చించాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికలో నానా రభస సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లోర్లీడర్ రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న కొందరు కార్పొరేటర్లు గ్రేటర్ సమావేశాలను బల ప్రదర్శనకు వినియోగించుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందుకే వాళ్లను అలా వదిలేయకుండా… ఆ ఫ్లోర్లీడర్ పదవేదో భర్తీ చేయండంటూ గ్రేటర్ జనం బీజేపీ అధిష్ఠానానికి సూచిస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ను జీహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. శనివారం జరిగిన ఐదో సాధారణ సమావేశంలో రూ. 6,224 బడ్జెట్ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కౌన్సిల్ ఎదుట ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను చర్చించిన కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తదనంతరం సాధారణ సమావేశంలో సభ్యులందరూ వివిధ ప్రశ్నలపై మాట్లాడాలని మేయర్ కోరగా ఏఐఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు పదే పదే సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేయగా సభను పది నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. ప్రజా సమస్యలపై చర్చించడం కోసం బీజేపీకి కావాల్సిన సమయం ఇస్తానని మేయర్ విజ్ఞప్తి చేసినప్పటికీ బీజేపీ సభ్యులు పట్టు విడవకుండా పోడియం చుట్టూ నిలబడి సభకు అంతరాయం కల్పించారు.
దానితో మేయర్ ఆగ్రహించారు. సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినా పద్ధతి మానుకోకపోవడంతో మరోసారి 15 నిమిషాల పాటు కౌన్సిల్ను వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు, అదేవిధంగా స్టాండింగ్ కమిటీకి సంబంధించిన తీర్మానాలను ఆమోదించినట్లు మేయర్ ప్రకటించారు. ఆ తర్వాత సాధారణ సమావేశంలో ఎజెండా ప్రకారం ముందుగా బీజేపీ సభ్యులకు అవకాశం ఇచ్చినా వారు వినియోగించుకోకపోవడంతో తరువాత ప్రశ్నను ఏఐఎంఐఎం సభ్యులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం వివరిస్తుండగానే మళ్లీ బీజేపీ సభ్యులు గొడవ చేయడంతో కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు. కాగా కౌన్సిల్ ఆమోదించిన బడ్జెట్ను జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించి అనుమతి తీసుకోనున్నారు.
మూల ధనవ్యయంలో రోడ్ల అభివృద్ధి, స్కైవేలు, అండర్పాస్లు, ఫ్లై ఓవర్లు, ప్రధాన రోడ్ల నిర్వహణ, సీఆర్ఎంపీ, ఎస్ఆర్డీపీ, ఇతర రోడ్ల అభివృద్ధికి రూ.1,530 కోట్లు ఖర్చు చేస్తుంది. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ తన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది. గతంలో వచ్చిన వరదల దృష్ట్యా నాలాల అభివృద్ధిపై దృష్టి సారించి వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం(ఎస్ఎన్డీపీ)లో భాగంగా చేపడుతున్న పనులకు రూ.280 కోట్లు, ఇతర నాలా పనుల నిర్వహణకు రూ.200 కోట్లు, మొత్తం ఖర్చు చేయనున్నది. అంటే మూల ధనవ్యయంలో అధిక భాగం మౌలిక సదుపాయల కోసం ఖర్చు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, వైకుంఠధామాల అభివృద్ధి, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, క్రీడా మైదానాల అభివృద్ధి, మోడ్రన్ మార్కెట్ల నిర్మాణ పనులకు రూ. 143 కోట్లను ఖర్చు చేయనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో థీమ్ పార్క్ అభివృద్ధి, గ్రీనరీ మరింతగా పెంచేందుకు రూ. 294 కోట్లతో గ్రీన్ బడ్జెట్ను కేటాయించారు. వీటితో పాటు అభాగ్యుల ఆకలి తీర్చిన అన్నపూర్ణను పూర్తి స్థాయిలో కొనసాగించడానికి రూ. 25కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎంఎస్ ప్రభాకర్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్రెడ్డి, కమిషనర్ డీఎస్.లోకేశ్కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఈఎన్సీ జియా ఉద్దీన్, సీఈ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు జయరాజ్ కెనడీ, బి.సంతోష్, శృతిఓజా, ప్రియాంక అలా, వి.కృష్ణ, విజయలక్ష్మి, సీసీపీ దేవేందర్రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, మమత, శ్రీనివాస్రెడ్డి, అశోక్ సామ్రట్, శంకరయ్య, పంకజ తదితరులు పాల్గొన్నారు.
పథకం ప్రకారమే సభకు అడ్డు తగిలారు
మాట్లాడేందుకు ప్రజా సమస్యలు లేవు.. ఏం మాట్లాడాలో వారికి అర్థం కాలేదని, పక్కా పథకం ప్రకారం కావాలనే సభలో అంతరాయం సృష్టించారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. సమావేశాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని..ఆ ఉద్ధేశంతోనే వచ్చారన్నారు. సభ ముగిసిన ఆనంతరం ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సభ ప్రారంభం అయినప్పటి నుంచి బీజేపీ కార్పొరేటర్లు సభ నిర్వహణకు అడుగడుగునా అడ్డు తగిలినట్లు మేయర్ చెప్పారు. తన కుర్చీని చుట్టుముట్టి అవమానించారని, సమావేశాన్ని అగౌరపరిచారని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలేంటో చెప్పాలని, వాటిపై చర్చిద్దామని పలు మార్లు బీజేపీ సభ్యులను అడగినట్లు మేయర్ వివరించారు.
ప్రభుత్వంపై నిందలు వేయడమే వారి లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం సాయంతోనే జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతుందని మేయర్ స్పష్టం చేశారు. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టుతో నాలాలను అభివృద్ధి చేసి వరద ముంపును నివారించినట్లు, ఎస్ఆర్డీపీతో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చినట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా సమస్యల తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అన్నీ పార్టీల కార్పొరేటర్లను తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్ర సర్కారు నుంచి హైదరాబాద్కు ఎన్ని నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలని మేయర్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీకి కేంద్రం ఎందుకు నిధులివ్వడం లేదని అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్రెడ్డి, ఇతర కార్పొరేటర్లు పాల్గొన్నారు.
సభను సాగనివ్వరు
జీహెచ్ఎంసీ బడ్జెట్ మీద చర్చిద్దామని మేయర్ అంటారు… కానీ బీజేపీ కార్పొరేటర్లు ఉప్పల్ నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదాన్ని తెరపైకి తెచ్చిపెడతారు.అభివృద్ధి పనులపై చర్చిద్దామని మేయర్ సూచిస్తే.. బడ్జెట్ ఆమోదం తర్వాత అంటూ మంకుపడతారు.ప్రజా సమస్యలపై మాట్లాడమంటే.. మేయర్ పోడియం దగ్గరికి పోయి నానా రభస చేస్తారు.
ఇదీ… గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్ల తీరు. దాదాపు రెండు సంవత్సరాలుగా జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్లీడర్ పదవి ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు ఐదు పర్యాయాలు కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. సమర్థుడు దొరకడం లేదా? సఖ్యత కుదరడం లేదా? పార్టీలో అంతర్గత సమస్యనో ఏమోగానీ… బీజేపీ అధిష్టానం ఫ్లోర్లీడర్ పదవి భర్తీకి జంకుతుంది. దీంతో రేసులో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు అటు అధిష్టానం మీద తిరుగుబావుటా ఎగురవేయలేక… ప్రజా సమస్యలు చర్చించాల్సిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికలో నానా రభస సృష్టిస్తున్నారు. ఏ ఒక్క సమావేశంలోనూ బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేసింది లేదు. ముఖ్యంగా ఫ్లోర్లీడర్ రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న కొందరు కార్పొరేటర్లు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. గ్రేటర్ సమావేశాలను వీరు బల ప్రదర్శనకు వినియోగించుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందుకే వాళ్లను అలా వదిలేయకుండా… ఆ ఫ్లోర్లీడర్ పదవేదో భర్తీ చేయండంటూ గ్రేటర్ జనం బీజేపీ అధిష్టానానికి సూచిస్తున్నారు.
ఎవరికి వారే…
బీజేపీ కార్పొరేటర్లు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. సభలో తలోదారి అన్నట్లుగా నిరసన గళాన్ని విప్పారు. రోజంతా చేసిన వారి డ్రామాలో పూర్తిగా సమన్వయం లోపించిందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకున్నారు. కుర్చీలు ఎక్కడం, మేయర్ పోడియంపై చేతులు వేస్తూ ఇష్ఠానుసారంగా వ్యవహరించారు. ఒక దిశా నిర్దేశం లేకుండా జరిగిన వారి నిరసనలతో ఆ పార్టీ మహిళా కార్పొరేటర్లే విసుగు ప్రదర్శించారు. మైలార్దేవరపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, ఆర్కే పురం కార్పొరేటర్ రాధా ధీరజ్రెడ్డి, చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, గుడిమల్కాపూర్- దేవర కరుణాకర్, మన్సురాబాద్- కొప్పుల నర్సింహారెడ్డి… వంటి వారు ఫ్లోర్ లీడర్ రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సరిగ్గా సభలోనూ వీరే బల ప్రదర్శన చేసేందుకు పోటీపడ్డారు. బీజేపీ సీనియర్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ తమ పార్టీ కార్పొరేటర్లు చేస్తున్న అర్థంలేని నిరసనలను నిస్తేజంగా చూస్తూ సీటుకే పరిమితం కావడం కనిపించింది.
బీజేపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యల గురించి అస్సలు మాట్లాడరు. పక్కా పథకం ప్రకారం కావాలనే సభలో అంతరాయం సృష్టించారు. సమావేశాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని.. ఆ ఉద్దేశంతోనే వచ్చారు. నా కుర్చీని చుట్టుముట్టి అవమానించారు. అభివృద్ధి కార్యక్రమాలపై జరగాల్సిన చర్చల సమయాన్ని వృథా చేస్తున్నారు.
– మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం