సిటీబ్యూరో, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. తాజాగా వీధి వ్యాపారులకు మూడో విడతలో ఒక్కొక్కరికి రూ. 50వేలను పంపిణీకి శ్రీకారం చుట్టింది. రుణాల అందజేతలో భాగంగా వీధిలో తిరుగుతూ చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించే ఉద్దేశంతో హైదరాబాద్ మహానగరంలో సర్వే చేయగా 1, 63, 274 మందిని గుర్తించారు. అందులో 1,62,985 మందికి గుర్తింపు కార్డులను జారీ చేశారు.
30 వెండింగ్ కమిటీలను ఏర్పాటుతో పాటు 584 కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే రూ. 93.83కోట్ల రుణాలను 72, 718 మందికి మంజూరు చేయగా..అందులో రూ. 72.27కోట్ల రుణాలను 60,306 స్ట్రీట్ వెండర్స్కు పంపిణీ చేశారు. తాజాగా మూడో విడత పంపిణీకి శ్రీకారం చుట్టారు. రూ. 50వేల చొప్పున 1.09 కోట్ల రూపాయలను 227 మంది స్ట్రీట్ వెండర్స్కు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
వీధి వ్యాపారుల్లో మరింత చైతన్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న వీధి వ్యాపారుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పీఎం సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన, తదితర పథకాలను మరింత పకడ్బందీగా అందించేందుకు వీధి వ్యాపారుల పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పొందుపర్చేందుకు వెబ్ ఆధారిత ప్రత్యేక సమగ్ర యాప్ను రూపొందించింది. ఇందులో భాగంగానే వీధి వ్యాపారులను చైతన్యం చేసి వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు ‘మైభిడిజిటల్’ అనే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీటితో పాటు వీధి వ్యాపారులతో స్విగ్గీ, జుమోటోలు ఒప్పందం కుదుర్చుకుంటుండడం గమనార్హం. 2125 మంది స్విగ్గీతో , జుమోటోతో 90 మంది ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటి వరకు రూ50లక్షలకు పైగా బిజినెస్ చేసినట్లు అధికారులు తెలిపారు.