అమీర్పేట్, నవంబర్ 4 : వచ్చే 40 ఏండ్లకు సరిపడా నీటి వనరులను కలిగి ఉన్నామని, 5 ఏండ్ల పాటు కరువు తాండవించినా గ్రేటర్కు నీటి సరఫరా చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి ఎం.డి దాన కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట్లోని ఐటీసీ గ్రాండ్ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియాల్టీ – ప్రాస్పెక్ట్స్ అండ్ చాలెంజెస్ అనే అంశంపై ‘తెలంగాణ ఇన్ఫ్రా సమిట్ 2022’ కార్యక్రమం జరిగింది. సీఐఐ తెలంగాణ ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ ప్యానెల్ కన్వీనర్ ఎం.గౌతమ్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు జలమండలి ఎం.డి. దాన కిశోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్లోబల్, పాన్ ఇండియా స్థాయి పెట్టుబడులకు అనుకూలమైన మౌలిక వసతులను హైదరాబాద్ నగరం కలిగి ఉందన్నారు. నీరు, రోడ్లు, విద్యుత్, నాలాల అభివృద్ధి, వరద నియంత్రణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిందని తెలిపారు. భవిష్యత్లో మౌలిక వసతులను మరింత విస్తరించేందుకు వీలుగా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నదని, ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐఐ తెలంగాణ చాప్టర్ ఛైర్మన్ వగిష్ దీక్షిత్, వైస్చైర్మన్ సి.శేఖర్రెడ్డి, సీఐఐ డైరెక్టర్ షేక్ సమిఉద్దీన్ పాల్గొన్నారు.