సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడంలో జీహెచ్ఎంసీ ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. వీధి వ్యాపారులకు రుణాల అందజేతలో ప్రతి విడతల్లో మెరుగైన ప్రదర్శనను రాబట్టింది. తాజాగా కేంద్రం ప్రకటించిన జాబితాలో జీహెచ్ఎంసీ మూడవ విడత రుణాల పంపిణీలో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. 40 లక్షల జనాభా దాటిన కేటగిరిలో గ్రేటర్ హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హిర్దీప్ సింగ్ చేతుల మీదుగా పురపాలక శాఖ అధికారులు అవార్డులు అందుకున్నారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చే పీఎంస్వాన్ నిధి ప్రారంభించి మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందుకున్నారు. కాగా మొదటి విడత రుణాల పంపిణీలో భాగంగా 40 లక్షలకు పైగా జనాభా ఉన్న కేటగిరిలో జీహెచ్ఎంసీ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది. రెండవ విడత రుణాల పంపిణీలో మొదటి విడత రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి ఒక్కొక్క వీధి వ్యాపారికి రూ.20వేలు అందించారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే రెండవ స్థానాన్ని దక్కించుకున్నది. ఇక మూడవ విడతలో భాగంగా రూ.20వేల రుణాన్ని తీసుకొని చెల్లించిన వారికి రూ.50వేలను మూడవ విడతలో అందించారు. 40 లక్షల జనాభా దాటిన కేటగిరిలో గ్రేటర్ హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న వీధి వ్యాపారుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పీఎం సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన, శ్రమయోగి మందన్ పింఛన్ యోజన, మాతృవందన యోజన, జననీ సురక్షణ యోజన, జన్ధన్ యోజన, వన్ నేషన్ వన్ కార్డు తదితర పథకాలను మరింత పకడ్బందీగా అందించేందుకు, వీధి వ్యాపారుల పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పొందుపరిచేందుకు వెబ్ ఆథారిత ప్రత్యేక సమగ్ర యాప్ను రూపొందించింది. ఇందులో భాగంగా వీధి వ్యాపారులను చైతన్యం చేసే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు ‘మైబి డిజిటల్’ అనే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్నారు. వీటితో పాటు వీధి వ్యాపారులతో స్విగ్గీ, జుమోటోలు ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.