సంపూర్ణ స్వచ్ఛత కోసం నగర పాలక సంస్థ బల్దియా పటిష్టమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాబోయే వంద రోజుల్లో వంద శాతం పారిశుధ్య నిర్వహణ జరిగేలా కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా బహిరంగ చెత్త పాయింట్లను తొలగించనున్నారు. బస్తీ శానిటేషన్ కమిటీలను ఏర్పాటు చేసి స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోనున్నారు. సర్కిళ్ల వారీగా యూత్క్లబ్లు, కార్పొరేట్స్, ఎన్జీవోలను భాగస్వామ్యం చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. యావత్ కార్యాచరణ విజయవంతమయ్యేందుకు వీలుగా ప్రతి గురువారం జోన్ల వారీగా బల్దియా అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహించేందుకు 100 రోజుల కార్యాచరణకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. వంద శాతం ఇంటింటి చెత్త సేకరణతో పాటు రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు, బస్స్టేషన్లు, పార్కులు, వ్యాపార ప్రాంతాల్లో గార్బేజ్ కనిపించకుండా పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ చేపట్టేందుకు 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నది. పారిశుధ్య నిర్వహణలో తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో… ఇటీవల ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా) బృందం 2500 జీవీపీ పాయింట్లలో 120 బృందాలుగా ఏర్పడి, జేఎన్ఏఎఫ్ఏయూకు సంబంధించి 18 మంది పీజీ విద్యార్థులతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. మూడు కేటగిరీలుగా.. మార్కెట్, కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాల్లో ఏం జరుగుతోంది? చెత్త వేయడానికి గల కారణాలు? లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ? అనే అంశాలపై ఆస్కి బృందం క్షుణ్ణంగా సర్వే చేసి పలు సూచనలతో నివేదికను జీహెచ్ఎంసీకి సమర్పించారు. ఈ మేరకు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు.