సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో రూ. 1670 కోట్లు రాబట్టింది. గత ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 నాటికి దాదాపు 13.5 లక్షల మంది నుంచి ఆదాయాన్ని సమకూర్చుకున్నది. 2021-22 సంవత్సరంలో 1495.29కోట్ల మేర ఆస్తిపన్ను వసూలు కాగా.. ఈ సారి అదనంగా రూ.200కోట్లకు పైగా రావడం విశేషం. ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ. 741.35కోట్ల మేర ఆదాయం సమకూరడం ఒక కారణమైతే.. కమిషనర్ లోకేశ్కుమార్ సహా ఉన్నతాధికారులంతా ఆస్తిపన్ను వసూళ్లపై రోజు వారీ సమీక్షలే ఈ స్థాయి వసూళ్లకు కారణమని అధికారులు పేర్కొన్నారు.
ఎక్కువగా శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంబజార్, చందానగర్ సర్కిళ్లలో ఆస్తిపన్ను చెల్లింపులు జరిగాయి. అత్యల్పంగా ఫలక్నుమా సర్కిల్లో వసూలయ్యాయి. దాదాపు 18 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉండగా.. సుమారు 4.5 లక్షల మంది చెల్లించకుండా ఉన్నారు. దీంతో రూ. 2వేల కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. అయితే బకాయిదారులపై శనివారం నుంచి రెండు శాతం అదనపు వడ్డీ భారం పడనున్నది. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు చెల్లింపునకు అవకాశం కల్పించగా..చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు. చివరి రోజు రూ.60 కోట్ల మేర ఆదాయం రావడం గమనార్హం.