సిటీబ్యూరో, మే 26 ( నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. అవుట్సైడ్ ఫుడ్పైనే అత్యధికంగా ఆధారపడే ఆహార ప్రియుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల వరుస దాడులతో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్ల నిజస్వరూపం బయటపడుతుంది. నోరూరించే వంటకాలతో.. మెరిపించే అలంకరణలతో ఆహార ప్రియులను తియ్యగా మోసం చేసిన హోటల్స్.. నగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల కేఎఫ్సీ, కృతుంగ, రెస్టో బార్లోనూ.. నాణ్యతలేని ఆహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అధికారులు దాడులు పలు హోటళ్లలో ముమ్మరం చేశారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల దెబ్బతో చాలా మంది వీకెండ్స్ డిన్నర్, లంచ్ ప్రోగ్రాంలు రద్దు చేసుకుంటున్నారు. పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సందర్శన ప్రాంతాలను వీక్షించి లంచ్, డిన్నర్లు ఇష్టమైన రెస్టారెంట్లో తినేసి ఇంటికి వెళ్తుంటారు. కానీ ఇటీవల నగరంలో కుళ్లిన వంటకాలు హోటల్స్లో వడ్డిస్తున్నారనే విషయం బయటకు రావడంతో వాళ్లంతా బయట ఆరగించడానికి సంశయిస్తున్నారు. ఏ హోటల్, రెస్టారెంట్ను చూసినా అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. అనారోగ్యం కొని తెచ్చుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు.
సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్స్లో కిచెన్లను పరిశీలిస్తే మనం అక్కడ తినొచ్చా? లేదా? అనేది అర్థమైపోతుంది. కానీ కిచెన్లోకి అనుమతి ఉండదు. కిచెన్ కనిపించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. గడువు ముగిసిన మసాలాలు, కుళ్లిన కోడిగుడ్లు, దుర్వాసన వెదజల్లే మాంసం, గడువు ముగిసిన పన్నీరు ఇలా సర్వం కల్తీతోనే వంటకాలను తయారు చేస్తున్నారు. ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనేది ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు సూచిస్తున్నాయి.
నగరంలో బార్ అండ్ రెస్టారెంట్స్, సిట్టింగ్ వైన్స్లో కిచెన్లను ఏర్పాటు చేసి మందుబాబులకు వంటకాలు అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ వినియోగించే ఫుడ్లో కుళ్లిన ఉల్లిగడ్డలు, మసాలాలు, మాంసం, కోడిగుడ్లు తదితర వాటితో ఘుమఘుమలాడించేల వంటకాలను సర్వ్ చేస్తున్నారు. మందుబాబులంతా మద్యం తాగడంలోని బిజీగా మారుతుండటంతో వాళ్లకు ఎలాంటి ఫుడ్ సర్వ్ చేస్తున్నారో కూడా తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని బార్స్ అండ్ రెస్టారెంట్స్లో కూడా అధికారులు దాడులు చేసి కిచెన్లో కుళ్లిన వంటకాలను గుర్తించారు. ఓవైపు మద్యం, మరోవైపు కుళ్లిన ఆహారంతో మందుబాబుల ఆరోగ్యం గుల్ల అవ్వడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా వరకు నగరంలోని బార్లలో ఇలాంటి దుస్థితే ఉన్నదని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు అవుట్సైడ్ ఫుడ్ తినకపోవడమే శ్రేయస్కరమని తెలిపారు.
నగరంలో చాలా మంది బయటి ఫుడ్పైనే ఆధారపడుతుంటారు. ఉద్యోగాల బిజీలో పడి ఇంట్లో వంట చేయడమే చాలా మంది మరిచిపోతున్నారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఇందులో ఏదో ఒక్కటి మాత్రం బయట హోటల్స్లోనే చేస్తున్నారు. అంతలా బయటిఫుడ్ వినియోగం పెరిగింది. అయితే ఈ విధానం అనారోగ్యాన్ని అత్యంత తొందరగా తెచ్చుకోవడమే. ప్రాసెస్డ్ ఫుడ్తో పిల్లలకు టిఫిన్స్, స్నాక్స్ అని చెబుతూ తినిపిస్తున్నారు. అధికారులు ఈ దాడులను కొన్ని రోజులే చేయకుండా నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి.
మేం ప్రతి వీకెండ్లో ఫ్యామిలీ లేదా స్నేహితులతో డిన్నర్ ప్లాన్ చేస్తుంటాం. కానీ ఇటీవల హోటల్స్, రెస్టారెంట్లలో కుళ్లిన ఆహారం బయటపడటం చూశాక భయం వేస్తుంది. ఇన్ని రోజులు మేం తింటున్న ఆహారంలో వినియోగించినవన్నీ కాలం ముగిసినవేనా.? అనే అనుమానం వస్తుంది. రుచి కోసం ఏవేవో కెమికల్స్ వినియోగిస్తున్నారు. అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మేం వీకెండ్ డిన్నర్స్ను రద్దు చేసుకున్నాం. అనారోగ్యం తెచ్చుకోవడానికి సిద్ధంగా లేము.
-ప్రసన్న జ్యోతి, ఆర్టిస్టు