11 అంశాలకు ఆమోదం తెలిపిన సభ్యులు
14 చోట్ల విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు
సీఎస్ఆర్ కింద 25 చెరువుల అభివృద్ధికి కార్పొరేట్ కంపెనీలకు ఎంఓయూ
ఫతేనగర్ ఆర్వోబీ పొడిగింపునకు 71 చోట్ల ఆస్తుల సేకరణ
రాజేంద్రనగర్లో సర్వీస్ రోడ్డు విస్తరణ
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను దిగ్గజ సంస్థలకు దత్తతకు ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహన దారుల సౌకర్యార్థం 14 చోట్ల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 12వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు 11 అంశాలకు ఆమోదించారు. ఇందులో ప్రధానంగా 14 చోట్ల ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు, ఫతేనగర్ ఆర్వోబీ పొడిగింపునకు అవసరమైన 71 చోట్ల ఆస్తుల సేకరణ, రాజేంద్రనగర్లో సర్వీస్ రోడ్డు వెడల్పు, పలు కార్పొరేట్ కంపెనీలకు సీఎస్ఆర్ కింద చెరువుల సుందరీకరణ, నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలాం షాహిద్, మహపర, పర్వీన్ సుల్తానా, బాత జబీన్, కురుమ హేమలత, మందగిరి స్వామి, విజయ్కుమార్ గౌడ్, మహమ్మద్ రషీద్ ఫరీదుద్దీన్, సీఎన్ రెడ్డి, మందడి శ్రీనివాస్ రెడ్డి, శేషగిరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, కెనడీ, ఈఎన్సీ జియాఉద్దీన్, సీసీపీ దేవేందర్ రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, అడిషనల్ కమిషనర్లు శంకరయ్య, రవికిరణ్, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్ అశోక్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ మమత, తదితరులు పాల్గొన్నారు.
యూనిట్కు రూపాయి చొప్పున జీహెచ్ఎంసీకి
వాహన కాలుష్యం, చమురు వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్న దరిమిలా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో మకువ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే పబ్లిక్ చార్జింగ్ సెంటర్ల వినియోగంతో పాటు తద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మకంగా తొలుత 14 ప్రాంతాల్లో ఏర్పాటుకు టీఎస్ రెడ్కో సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకుంటున్నది. టీఎస్ రెడ్కో పబ్లిక్ చార్జింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన తర్వాత యూనిట్కు రూపాయి చొప్పున జీహెచ్ఎంసీకి ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించనున్నది. ఈ పక్రియను కొనసాగించేందుకు జీహెచ్ఎంసీతో టీఎస్ రెడ్కో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే ఈ – వెహికిల్ పబ్లిక్ చార్జింగ్ సెంటర్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఫాస్ట్ చార్జింగ్ గల డీసీ -001(15కిలో వాట్) కెపాసిటీ గల ఒకొక సెంటర్లో ఒకటి చొప్పున మొత్తం 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అదే ప్రాంతాల్లో (122-150 కిలోవాట్ ) సామర్థ్యం గలవి ఒకొక ప్రాంతాల్లో 2 చొప్పున చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.
స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే ..!!